భద్రతా మండలి సంస్కరణలను ఇకపై ఆలస్యం చేయలేం

భద్రతా మండలి సంస్కరణలను ఇకపై ఆలస్యం చేయలేం
 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఆగలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన శిఖరాగ్ర సమావేశ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బ్రిక్స్ దేశాల కోసం ప్రపంచ పాలనకు సంబంధించి 10 సూత్రాల మార్గసూచిని ప్రతిపాదించారు. 
 
ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాల ప్రపంచవ్యాప్త ప్రభావం నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను పరిరక్షించడంపై చర్చించనున్న రెండు రోజుల వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని శనివారం ప్రారంభిస్తూ, వివిధ సవాళ్లను ఎదుర్కోవడానికి ‘గ్లోబల్ సౌత్’ (ప్రపంచ దక్షిణాది) ‘నియమాలను రూపొందించేదిగా’ మారాలని కోరారు.  బ్రిక్స్ ప్రపంచ వేదికపై ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుందని పేర్కొంటూ ఈ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా, ఇతర పాశ్చాత్య శక్తులకు ఒక సందేశంగా భావిస్తున్నారు. 
“నేడు, ప్రపంచ సంక్షోభాలలో గ్లోబల్ సౌత్ ముందు వరుసలో నిలుస్తున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మాత్రం వెనుకబడి ఉంది. మనం ఈ ‘విశేషాధికారాల పిరమిడ్‌’ను ‘భాగస్వామ్య వేదిక’గా మార్చాలి. అక్కడ ప్రతి దేశానికి ఒక గొంతుక ఉండాలి, ప్రతి సభ్య దేశానికి భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ప్రయత్నానికి మానవాళి అభివృద్ధి కేంద్రంగా ఉండాలి,” అని మోదీ అభిలాషను వ్యక్తం చేశారు.
 
 “ఈ విషయంలో, ప్రపంచ పాలన సంస్కరణల కోసం మనం సంయుక్తంగా 10 ప్రతిపాదనలను రూపొందించాలని, వచ్చే శిఖరాగ్ర సమావేశం నాటికి వాటిని బ్రిక్స్ సంస్కరణల రోడ్‌మ్యాప్‌గా తీర్చిదిద్దాలని నేను ప్రతిపాదిస్తున్నాను,” అని మోదీ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోల సమక్షంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్న ఇతర నాయకులలో అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్ ఉన్నారు.  “ప్రపంచ పాలన ప్రస్తుత నిర్మాణం ఒక పిరమిడ్‌ను పోలి ఉంది: అధికారం, నిర్ణయాధికారం పైభాగంలో కేంద్రీకృతమై ఉండగా, దిగువ శ్రేణులలోని దేశాలు ఈ నిర్ణయాల వల్ల ప్రభావితమవుతూ, వాటిని రూపొందించలేకపోతున్నాయి,” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
ఇందుకోసం, ప్రాతినిధ్యం, స్పందన, నియమ నిబంధనల రూపకల్పన అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. “బ్రిక్స్‌ను బలోపేతం చేస్తూనే, మనం ప్రపంచ సంస్కరణల కోసం కూడా ఒక మార్గాన్ని నిర్దేశించుకోవాలి. ప్రపంచ పాల ప్రస్తుత నిర్మాణం ఒక పిరమిడ్‌ను పోలి ఉంది: అధికారం, నిర్ణయాధికారం పైభాగంలో కేంద్రీకృతమై ఉండగా, దిగువ శ్రేణులలోని దేశాలు ఈ నిర్ణయాల వల్ల ప్రభావితమవుతూనే, వాటిని రూపొందించలేకపోతున్నాయి,” అని ఆయన పేర్కొన్నారు.
 
 “ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.  ఈ విషయంపై చర్చలు ఒక నిర్దిష్ట కాలపరిమితికి, స్పష్టమైన ఫలితాలకు ముడిపడి ఉండాలి. అదేవిధంగా, ఆర్థిక సంస్థలలో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధాన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి” అని స్పష్టం చేశారు.
 
 ప్రపంచ వాణిజ్యంలో సముద్రయాన కార్మికుల కీలక పాత్రను హైలైట్ చేస్తూ, వారి కోసం సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. ఇందుకోసం, ‘సముద్రయాన కార్మికుల అత్యవసర సహాయక నెట్‌వర్క్’ను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 “నేను ప్రస్తావించాలనుకుంటున్న మూడవ అంశం నియమాల రూపకల్పనకు సంబంధించింది. భవిష్యత్ ప్రపంచ నియమాలను నిర్వచించడంలో సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించడం చాలా కీలకం. ఏఐ, సైబర్‌స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతలు వంటి రంగాలు భవిష్యత్ అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్ నియమాలను కూడా నిర్వచిస్తున్నాయి,” అని ఆయన తెలిపారు.
 
 “మనం గ్లోబల్ సౌత్‌ను ‘నియమాలను పాటించే దేశం’ నుండి ‘నియమాలను రూపొందించే దేశం’గా మార్చడానికి కృషి చేయాలి. బ్రిక్స్ ద్వారా, మనం గ్లోబల్ సౌత్ దేశాల యువ దౌత్యవేత్తలకు, విధాన రూపకర్తలకు సంప్రదింపుల నైపుణ్యాలు, ఆచరణాత్మక శిక్షణ, న్యాయ నైపుణ్యాన్ని అందించగలము,” అని ఆయన జోడించారు.