మోల్డోవా నుండి గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్‌ భారత్ కు అప్పగింత

మోల్డోవా నుండి గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్‌ భారత్ కు అప్పగింత
 
పంజాబ్ పోలీసుల యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజిటిఎఫ్), అమృత్‌పాల్ సింగ్ అలియాస్ అమృత్ దళం అలియాస్ గుర్పాల్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్‌ను మోల్డోవా నుండి భారతదేశానికి అప్పగించడంతో ఒక కీలక పురోగతిని సాధించింది. గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియాకు ప్రధాన కిరాయి హంతకుడిగా పనిచేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నిందితుడిని, ‘ఆపరేషన్ ఈస్టర్న్ రీచ్’ అనే పేరుతో ఆరు నెలల పాటు నిఘా ఆధారిత అంతర్జాతీయ ఆపరేషన్ తర్వాత దేశానికి తిరిగి తీసుకువచ్చారు. 
 
పంజాబ్ పోలీసుల ప్రకారం, అమృత్‌పాల్ సింగ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయి, ఆ తర్వాత ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా మోల్డోవాలో అరెస్టు అయ్యాడు. కేంద్ర, అంతర్జాతీయ ఏజెన్సీల సమన్వయంతో పంజాబ్ పోలీసుల ఏజిటిఎఫ్, ఓఎఫ్టీఈసీ బృందాలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.  పంజాబ్‌లో అమృత్‌పాల్ సింగ్‌పై మొత్తం 21 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉండగా, మిగిలిన 17 కేసులలో దర్యాప్తు కొనసాగుతోంది. 
 
అతను 2024 అక్టోబర్ చివరి వారంలో చండీగఢ్ నుండి జారీ చేసిన నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి భారతదేశం నుండి పారిపోయాడు. ఆ పాస్‌పోర్ట్‌లో ‘గుర్పాల్ సింగ్’ అనే గుర్తింపు ఉంది. భారతదేశం విడిచి వెళ్ళిన తర్వాత, అతను మొదట యూఏఈకి ప్రయాణించి, ఆ తర్వాత అనేక దేశాల గుండా ప్రయాణించి చివరకు మోల్డోవాకు చేరుకున్నాడు.
 
మోల్డోవాలో అతని అరెస్టు తర్వాత, పంజాబ్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు అతనిని భారతదేశానికి అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాయి. అమృత్‌పాల్ సింగ్‌ను గుర్తించి, తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి పంజాబ్ పోలీసుల ఏజీటీఎఫ్ మరియు ఓఎఫ్‌టీఈసీ పంజాబ్ సుమారు ఆరు నెలల పాటు నిఘా ఆధారిత అంతర్జాతీయ ఆపరేషన్‌ను నిర్వహించాయి.
 
 ‘ఆపరేషన్ ఈస్టర్న్ రీచ్’ అనే సంకేతనామంతో జరిగిన ఈ ఆపరేషన్‌లో భారతదేశం, విదేశాలలోని బహుళ ఏజెన్సీల మధ్య నిరంతర నిఘా, సమన్వయం చోటుచేసుకున్నాయి. పంజాబ్ పోలీసులు ఈ అప్పగింతను ఒక ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు, ప్రత్యేకించి ఒక యూరోపియన్ దేశం నుండి ఈ దళం చేపట్టిన మొదటి అప్పగింత ఇదే కావడం గమనార్హం.
 
చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయిన తర్వాత, నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి పంజాబ్ పోలీసులకు చెందిన నలుగురు సభ్యుల బృందం మోల్డోవాకు ప్రయాణించింది. ఆ బృందం 2026 సెప్టెంబర్ 11న చిసినౌ విమానాశ్రయంలో అమృత్‌పాల్ సింగ్‌ను తమ అదుపులోకి తీసుకుని, అతడిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది.