పిల్ల‌లు స్క్రీన్‌కు బానిస‌వుతున్నారు.. వారిని మైదానంలో ఆడించండి

పిల్ల‌లు స్క్రీన్‌కు బానిస‌వుతున్నారు.. వారిని మైదానంలో ఆడించండి
పిల్ల‌లు ఎక్కువ‌గా స్క్రీన్‌కు బానిస అవుతున్న‌ట్లు, మొబైల్ ఫోన్ల‌కు పిల్ల‌లు హ‌త్తుకుపోతున్నార‌ని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్య‌క్తం చేశారు.  జాతీయ ఉపాధ్యాయుల దినోత్స‌వం సందర్భంగా జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డు గెలిచిన వారితో మాట్లాడుతూ ఒక‌వేళ క్రీడ‌ల ప‌ట్ల పిల్ల‌లో ఆస‌క్తి పెరిగితే, అప్పుడు ఆ స్క్రీన్ బానిస‌త్వం నుంచి వాళ్లు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పారు. 
 
క్రీడ‌లు అంటే వీడియో గేమ్స్ కాదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పిల్ల‌ల్లో సృజనాత్మ‌క పెంచాల‌ని, వారిలో ఆట‌ల ప‌ట్ల ఆస‌క్తి పెంచేలా చేయాల‌ని చెబుతూ ఇలాంటి ప్రోగ్రామ్‌ల‌ను డిజైన్ చేయాల‌ని టీచ‌ర్ల‌కు ప్ర‌ధాని స‌ల‌హా ఇచ్చారు. డ్ర‌గ్స్ అంశాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావిస్తు కొన్ని ప్ర‌ధాన న‌గ‌రాలు, యూనివ‌ర్సిటీల్లో ఈ స‌మ‌స్య ఉందని, కానీ దీని ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న లేద‌ని, ఎటువంటి వివ‌ర‌ణ లేకుండానే కొన్ని సార్లు ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. 
 
పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న పట్ల టీచ‌ర్లు ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారిలో జ‌రుగుతున్న బీహేవియ‌ర్ మార్పుల‌ను ప‌రిశీలించాల‌ని ఆయన సూచించారు. యావ‌త్ విద్యా వ్య‌వ‌స్థ‌కు తాను ఒక్క విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నాన‌ని, కేవ‌లం పాఠ్య పుస్త‌కాల బోధ‌న‌ల‌తో మాత్ర‌మే కాదని, పిల్ల‌ల‌తో మ‌మేకంగా క‌లిస్తేనే వారిలో మార్పు వ‌స్తుంద‌ని ఆయన పేర్కొన్నారు. 
 
బాల్యాన్ని అంతం చేయ‌వ‌ద్దు అని, ఆ బాల్యాన్ని ర‌క్షించే సామ‌ర్థ్యం టీచ‌ర్ల‌కు ఉంద‌ని, పిల్ల‌లు స‌జీవంగా ఉండేందుకు కావాల్సిన చ‌ర్య‌ల‌న్నీ చేప‌ట్ట‌డ‌మే టీచ‌ర్ల బాధ్య‌త అని ప్ర‌ధాని మోదీ తెలిపారు.  “ఉపాధ్యాయులు పుస్తకాలు, సిలబస్‌కే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాల్లో భాగం కావాలి. పిల్లల్లో సహజంగా ఉండే ఆసక్తి, తెలుసుకోవాలనే కుతూహలాన్ని గుర్తించి దాన్ని సరైన దిశలో మళ్లించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. పిల్లల బాల్యాన్ని కోల్పోకుండా చూడటం ఉపాధ్యాయులు చేయగలిగే అతిపెద్ద సేవ. తరగతి గదిలో పాఠాలను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు సృజనాత్మక పద్ధతులను అనుసరించాలి” అని ఆయన సూచించారు.

తన పరిసర ప్రాంతాల్లో మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న ఓ ఉపాధ్యాయురాలి ప్రయత్నాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో తాను రొమ్ము క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎక్కువ మంది మహిళలు స్క్రీనింగ్‌ కోసం ముందుకు వస్తున్నారని, ఈ కార్యక్రమంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా నమోదైనట్లు మోదీ తెలిపారు. ఈ ఏడాది జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఎంపికయ్యారు.