భారత్ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, జీవన విధానం పరంగా ఇప్పటికే హిందూ దేశంగా ఉందని చెబుతూ రాజకీయంగానూ భారత్ను హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత సాధ్వి రితంభర స్పష్టం చేశారు. ఆమె పేర్కొన్నారు. పూరీలో బుధవారం శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పూరీలోని బాలియాపండాలోని సెవెన్ హిల్స్లో ఏడు రోజులపాటు భాగవత కథ నిర్వహించేందుకు వచ్చిన సాధ్వి రితంభర ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్పై జరుగుతున్న రాజకీయ చర్చపై స్పందిస్తూ భారతదేశ మెజారిటీ ప్రజల ఆలోచనల్లో ‘వసుధైవ కుటుంబకం’ భావన ఉందని చెప్పారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమనే ఈ సిద్ధాంతాన్ని రాజకీయ పార్టీలు ప్రపంచానికి పరిచయం చేయాలని ఆమె చెప్పారు.
సనాతన ధర్మంలోని ప్రాథమిక సిద్ధాంతాలను ప్రోత్సహించడం ద్వారా ‘వసుధైవ కుటుంబకం’ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చని సాధ్వి రితంభర సూచించారు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు, సామూహిక చైతన్యంలో హిందూ దేశ భావన ఇప్పటికే ఉందని ఆమె చెప్పారు. భారత రాజ్యాంగంలో శ్రీరామచంద్రుడి ప్రస్తావన నుంచి ‘సత్యమేవ జయతే’ వరకు దేశ సాంస్కృతిక భావజాలం కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.
హిందువుల సంక్షేమమే భారత సంక్షేమమని చెబుతూ భావాలు, ప్రవర్తన, జీవన విధానం పరంగా భారత్ హిందూ దేశంగానే ఉందని, రాజకీయంగా కూడా హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టంచేశారు. ఆవుల సంరక్షణపైనా ఆమె మాట్లాడారు. గోవధ, మహిళలపై హింస, గర్భంలోని ఆడ శిశువుల హత్య జరిగే చోట శాంతి, సంతోషం ఉండవని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు ఇతర మార్గాల్లో ఆదాయం పొందవచ్చని, అయితే గోమాంసం విక్రయాల ద్వారా ఆదాయం పొందడం తీవ్రమైన పాపమని ఆమె హెచ్చరించారు. శ్రీ జగన్నాథుడి దర్శనం తనకు ఎంతో భావోద్వేగ అనుభూతిని ఇచ్చిందని సాధ్వి రితంభర తెలిపారు. పూరీ సమన్వయానికి ప్రతీకగా నిలిచే పవిత్ర క్షేత్రమని ఆమె పేర్కొన్నారు.

More Stories
రామ మందిరం సీఈఓ కావడం శ్రీ రాముడి ఆశీర్వాదం
‘బదిలీలకు నగదు’పై దర్యాప్తుకు సీఎం మాన్ రాజీనామా చేయాలి
మణిపూర్ అసెంబ్లీకి మూడేళ్ళ తర్వాత కుకీ ఎమ్మెల్యేలు