చంద్రుడిపై ‘మూన్‌ బేస్‌’లో పాల్గొనమని ఇస్రోకు నాసా ఆహ్వానం

చంద్రుడిపై ‘మూన్‌ బేస్‌’లో పాల్గొనమని ఇస్రోకు నాసా ఆహ్వానం

మానవ అంతరిక్ష యానం, శాస్త్రీయ పరిశోధన, చంద్రుని అన్వేషణ, వాణిజ్య అంతరిక్ష కార్యకలాపాలలో సహకారాన్ని విస్తరించుకోవడంపై భారత్, అమెరికా దేశాలు చర్చించాయని, ఈ నెల ప్రారంభంలో బెంగళూరులో జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల సందర్భంగా నాసా తన `మూన్ బేస్’ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ఆహ్వానించిందని భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. 

ఈ ఆహ్వానం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న బంధానికి మరో సంకేతమని ఆయన పేర్కొన్నారు. కొనసాగుతున్న ప్రాజెక్టులను సమీక్షించడానికి, సహకారానికి కొత్త అవకాశాలను గుర్తించడానికి ఇస్రో, నాసా, అమెరికా విదేశాంగ శాఖ అధికారులను ఒకచోట చేర్చి, ఆగస్టు 5, 6 తేదీలలో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ రెండు రోజుల సమావేశం జరిగింది. 

చంద్రుని అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ప్రతిబింబిస్తూ, నాసా తన `మూన్ బేస్’ కార్యక్రమంలో చేరవలసిందిగా ఇస్రోను ఆహ్వానించడం ఈ చర్చల  ముఖ్య ఫలితాలలో ఒకటి. కొద్దికాలం క్రితమే, 2025లో మానవ అంతరిక్ష యానంలో భాగస్వామ్యం కోసం ఇరు దేశాలు ఒక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేశాయి. ఆ ఒప్పందం వ్యోమగాముల శిక్షణకు, విస్తృత అంతరిక్ష యాన సహకారానికి మార్గం సుగమం చేసింది. 

అంతరిక్ష రంగంలో అమెరికాకు అత్యంత విశ్వసనీయ భాగస్వాములలో భారత్ ఒకటని గోర్ తరచుగా అభివర్ణిస్తుంటారు. ఈ భాగస్వామ్యం విస్తరిస్తూనే ఉంది.ఇప్పుడు భూ పరిశీలన, ఉపగ్రహాలు, మానవ అంతరిక్ష యాత్ర వంటి విస్తృత రంగాల వరకు విస్తరిస్తోంది. చంద్రుడిని, అంతకు మించిన ప్రదేశాలను శాంతియుతంగా అన్వేషించడం కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి రూపొందించిన ఆర్టెమిస్ ఒప్పందాల కింద సహకారంపై ఈ ప్రతిపాదన ఆధారపడి ఉంది. 

భారతదేశం 2023లో ఆర్టెమిస్ ఒప్పందాలలో చేరింది. నాసా `మూన్ బేస్‌’తో ఇస్రో అధికారికంగా జతకలిస్తే, చంద్ర యాత్రలు, అంతరిక్ష నౌకలు, శాస్త్రీయ పరికరాలు, సాంకేతికతలో తనకున్న నైపుణ్యాన్ని భారతదేశం అందించగలదు. ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ చంద్ర యాత్రలలో, చంద్రుని ఉపరితలంపై మానవులు పనిచేయడానికి అవసరమైన సాధనాలను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మరింత పెద్ద పాత్రను కల్పిస్తుంది. 

ప్రకృతి వైపరీత్యాలు, జీవావరణ వ్యవస్థలు, పర్యావరణ మార్పులకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇచ్చే నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ విజయవంతంగా ప్రయోగించిన వెంటనే ఈ చర్చలు జరిగాయి. నిసార్ విజయాన్ని అదనపు సహకార యాత్రలు, అంతరిక్ష సాంకేతిక కార్యక్రమాల ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు చూస్తున్నాయని అధికారులు తెలిపారు. 

భారతదేశానికి, నాసా చంద్ర యాత్రలో మరింతగా పాలుపంచుకోవడం అనేది ఇస్రో చంద్రయాన్ కార్యక్రమానికి చక్కగా సరిపోతుంది.ఎందుకంటే రెండూ ఒకే లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారిస్తాయి. ఇది మానవులను అంతరిక్షంలోకి పంపే దిశగా మరింత ముందుకు నడిపిస్తుంది. ఈ ఆహ్వానం చాలా ముఖ్యమైన విషయమే అయినప్పటికీ, ఇస్రో పాత్ర, చేపట్టబోయే సాధ్యనీయ మిషన్లు లేదా కాలక్రమాలకు సంబంధించిన వివరాల కోసం మనం ఇంకా వేచి చూస్తున్నాము.

చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో మానవులు నివసించేందుకు వీలుగా శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అమెరికా `మూన్ బేస్’  కార్యక్రమాన్ని చేపడుతోంది.  వరుసగా మానవ సహిత, మానవరహిత మిషన్లను నిర్వహించి ఈ స్థావరాన్ని అభివృద్ధి చేయాలని నాసా భావిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం ప్రపంచ అంతరిక్ష సంస్థలకు అత్యంత కీలకంగా మారింది. 

ఈ ప్రాంతంలో నీటి మంచు, ఇతర వనరులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో వ్యోమగాముల జీవనానికి, పరిశోధనలకు ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది.  దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వ్యోమగాములు అక్కడ నివసిస్తూ, పనిచేస్తూ, శాస్త్రీయ పరిశోధనలు చేసే అవకాశం కల్పించాలన్నది `మూన్‌ బేస్‌ ‘కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 

అంతేకాకుండా భవిష్యత్తులో చంద్రుడిని దాటి సుదూర అంతరిక్ష ప్రాంతాలకు మానవులను పంపేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడంలోనూ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నాసా చెబుతోంది. భారత్‌, అమెరికా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో నాసా ఈ ఆహ్వానం ఇచ్చింది.