పీఓకే ఆక్రమణను కప్పిపుచ్చడానికి మొక్కుబడి ఎన్నికలు

పీఓకే ఆక్రమణను కప్పిపుచ్చడానికి మొక్కుబడి ఎన్నికలు
పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓకే)లో ‘నామమాత్రపు’ ఎన్నికలు నిర్వహించడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మంగళవారం తీవ్రంగా విమర్శించింది. ఇస్లామాబాద్ ‘చట్టవిరుద్ధ ఆక్రమణను కప్పిపుచ్చడానికి మరియు దాని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి’ ఇది ఒక ప్రయత్నమని పేర్కొంది.
 
తన సాధారణ మీడియా సమావేశంలో, ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, మొత్తం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ‘భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగాలుగా’ ఉన్నాయని నొక్కి చెప్పారు. పీఓకేలో నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో ‘మొక్కుబడి శాసనసభ ఎన్నికల’పై జైస్వాల్ పాకిస్థాన్‌ను తీవ్రంగా ఖండించారు. ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని ప్రముఖంగా ప్రస్తావించారు.
 
పీఓకేలోని రావల్కోట్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో కనీసం 20 మంది మరణించినట్లు సమాచారం. “ప్రస్తుత మొక్కుబడి ఎన్నికల ప్రక్రియ, పాకిస్తాన్ తన అక్రమ ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికి, ఆ ప్రాంతంలో చేస్తున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరేమీ కాదు. మేము ముందే చెప్పినట్లుగా, మీకు తెలిసినట్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న ప్రజా నిరసన, ఆర్థిక దోపిడీకి, ప్రజల ప్రాథమిక హక్కులను నిరాకరించడానికి మరియు దాని పరిపాలనా కార్యకలాపాలకు ప్రత్యక్ష పర్యవసానమే,” అని ఆయన ధ్వజమెత్తారు. 
 
“పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్నాయని చెబుతున్న శాసనసభ ఎన్నికల గురించిన నివేదికలను మేము చూశాము. ఈ ప్రత్యేక విషయంలో భారతదేశ వైఖరి స్పష్టంగా, స్థిరంగా, అందరికీ తెలిసినదే. ప్రస్తుతం పాకిస్తాన్ అక్రమ, బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో విభాజ్యమైన, విడదీయరాని భాగాలు,” అని జైస్వాల్ తేల్చి చెప్పారు. 
 
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ప్రాణాంతక నిరసనలు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలపై పాకిస్తాన్ చేస్తున్న ఆర్థిక దోపిడీకి, ప్రాథమిక హక్కులను నిరాకరించడానికి ప్రత్యక్ష పర్యవసానమేనని జైస్వాల్ నొక్కి చెప్పారు. 
 
“మేము ఇంతకు ముందే చెప్పినట్లుగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న సామూహిక నిరసనల గురించి మీకు తెలిసే ఉంటుంది. మీరు అక్కడి తాజా దృశ్యాలను చూసే ఉంటారు. ఇవన్నీ ఆ దేశ ఆర్థిక దోపిడీకి, ప్రజల ప్రాథమిక హక్కులను నిరాకరించడానికి, వారిపై చేస్తున్న పరిపాలనాపరమైన అణచివేతకు ప్రత్యక్ష పర్యవసానమే” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.