* ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదని గొగాయ్, అఖిలేష్ విమర్శలు
కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా లేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయినా లీపేపర్ కేజీ కేసుల్లో దర్యాప్తును కేవలం 2 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించేందుకు తీసుకొచ్చిన “పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026” బిల్లు లోక్సభలో చర్చను ప్రారంభిస్తూ పేపర్ లీకేజీ ఘటనల్లో కఠిన శిక్ష అమలు చేసేందుకు పేపర్ లీకేజీ నిరోధక బిల్లులో సవరణ చేపట్టినట్లు తెలిపారు.
సెక్షన్ 10లోని సబ్సెక్షన్ 1 ప్రకారం లీకేజీ పాల్పడిన వ్యక్తికి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష ఉండేది. ఆ కేసుల్లో పది లక్షల జరిమానా కూడా ఉంది. అయితే సవరణ ద్వారా జైలుశిక్షను 5 నుంచి పదేళ్లకు మార్చారు. జరిమానాను 50 లక్షలకు పెంచారు. 2024 చట్టం ప్రకారం సర్వీస్ ప్రొవైడర్కు కోటి జరిమానా ఇస్తున్నారు. ఆ ఫైన్ను ఇప్పుడు 5 కోట్లకు పెంచారు. పరీక్షల నిర్వహణ నుంచి గతంలో 4 ఏళ్ల వరకు తప్పించేవారు. ఇప్పుడు సవరణ ద్వారా ఆ సమయాన్ని 8 ఏళ్లకు పెంచామని వివరించారు.
పేపర్ లీకేజీ కేసుల్లో వ్యవస్థీకృత నేరానికి పాల్పడే మాఫియాకు కూడా శిక్షా కాలాన్ని, జరిమానాను పెంచారు. గతంలో 5 నుంచి 10 వరకు ఉన్న జైలుశిక్షను ఇప్పుడు 7 నుంచి 10 ఏళ్ల వరకు పెంచారు. గతంలో ఆర్గనైజ్డ్ క్రైంకు పాల్పడితే కోటి జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని రూ. 10 కోట్లకు సవరించినట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వేగంగా న్యాయం అందించాలని ప్రధాని మోదీ చేసిన సూచన ప్రకారం.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటిల్లో టైం నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదిత బిల్లు చట్టమైతే సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. పరీక్ష పేపర్ లీకేజీలు అరికట్టేందుకు నందన్ నిలేకని ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఎంట్రన్స్ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని జితేంద్ర సింగ్ గుర్తుచేశారు.
2009, 2011లో ఎన్నో పేపర్ లీక్స్, 2010లో యూపీలో బీఈడీ పేపర్ లీక్, 2012లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ లీక్, తమిళనాడులో పీఎస్సీ పేపర్ లీక్ జరిగాయి. క్రమంగా ఇవి వ్యవస్థీకృత నేరాలుగా మారాయి. వీటిని అరికట్టేందుకు 1992, 2010లలో కొన్ని ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి ఎందుకు ఫలించలేదో ఆనాటి పాలకులే చెప్పాలని జితేంద్ర సింగ్ సూచించారు.
ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు అనేది విద్యార్థులు, యువత పట్ల మోదీ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇది భారత పార్లమెంట్ చరిత్రలోనే నిలిచిపోతుందని చెప్పారు. “చరిత్రను పరిశీలిస్తే 1992లో మొదటిసారి ఉమ్మడి పరీక్ష కోసం సిఫార్సు చేయడం జరిగింది. 2010లో యూపీఏ పాలనలో ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది. కానీ ఆ పని మధ్యలోనే నిలిచిపోయింది. అలా నిలిచిపోయిన పనిని పూర్తి చేసినందుకు మీరు ప్రధాని మోదీని, ఈ ప్రభుత్వాన్ని అభినందించాలి” అని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాల చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్, పేపర్ లీక్ల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని ఆరోపించారు.నీట్ పేపర్ లీక్పై 37 రోజుల విద్యార్థుల నిరసన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం, మరోవైపు ‘పాకిస్థాన్తో యుద్ధం చేసి తిరిగి వచ్చినట్లుగా’ బీజేపీ ఎంపీలు ఆయనకు పార్లమెంటులో స్వాగతం పలకడం మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఆయన ఎత్తి చూపారు.
బిల్లును పరిశీలించిన తర్వాత, పరీక్షలలోని అవకతవకలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి సుముఖంగా లేదనే అభిప్రాయం తనకు కలిగిందని ఆయన చెప్పారు. ప్రతిపాదిత సవరణను ‘కంటి తుడుపు చర్య’గా అభివర్ణిస్తూ, రెండేళ్ల క్రితం అసలు చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు పేపర్ లీక్లను నివారించడానికి ఉద్దేశించిన ఒక చారిత్రాత్మక చర్యగా ప్రభుత్వం దీనిని అభివర్ణించిందని గోగోయ్ గుర్తు చేశారు.
విద్యా రంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ, 2024 చట్టం వచ్చినా కూడా ప్రభుత్వ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు.“ఇది ఒక సవరణ బిల్లు. ఒకవేళ ఈ చట్టం 2024లో అమల్లోకి వస్తే, 2025 లేదా ఆ తర్వాత ఇన్ని ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయి?” అని ఆయన ప్రశ్నించారు.45 ప్రశ్నపత్రాలలో 44 లీక్ అయ్యాయని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ, నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీక్ దర్యాప్తు పురోగతిని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించారు.
“‘ప్రధాన మంత్రి’ని కాపాడటానికి ప్రభుత్వం ‘ప్రధాన్’ను తొలగించింది” అని చెబుతూ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.నీట్ పేపర్ లీక్పై జాతీయ రాజధానిలో జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై మాట్లాడుతూ, “ప్రభుత్వం తలవంచుతుంది, కానీ దానిని తలవంచేలా చేయడానికి ఎవరో ఒకరు కావాలి” అని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ల గురించి మాట్లాడుతూ, “చట్టం సమర్థవంతంగా ఉంటే బీజేపీ పదేళ్ల హయాంలో 20 పరీక్షలు ఎలా లీక్ అయ్యాయి..?” అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.“దొంగతనాన్ని నివారించడంలో విఫలమైన వారిని ఎలా నమ్మగలం? ఈ కొత్త బిల్లు ఇప్పటికే ఉన్న చట్టానికి కేవలం ఒక సవరణ మాత్రమే. మీరు ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు?” అని కూడా ఆయన మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఎమర్జెన్సీ’ అంశాన్ని, దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించి ప్రభుత్వం నిరసనను ఎలా అణచివేసిందనే విషయాన్ని ప్రస్తావించగా, ఎస్పీ అధ్యక్షుడు ఇలా చెప్పారు: “నేను ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చూడలేదు.కానీ ఇక్కడే జాతీయ రాజధానిలో అప్పుడు ఏమి జరిగిందో చూశాను. విద్యార్థుల నిరసనను అణచివేయడానికి ప్రభుత్వం టియర్ గ్యాస్ షెల్స్, మేకులు అమర్చిన లాఠీలు, ఇతర ఆయుధాలను ప్రయోగించింది.”
More Stories
పాక్ బలగాల అమానుష చర్యలో పీఓకేలో 20 మంది మృతి
మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయండి
సుప్రీంకోర్టును ఆశ్రయించిన గాయాలకు గురైన పోలీసు కుటుంబాలు!