నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు హైకోర్టు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి మూడు వారాల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్ మనోజ్ జైన్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తాము దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును విచారణకు స్వీకరించేందుకు రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు 2025 డిసెంబర్ 16న నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద కేసు విచారించడం చెల్లదన్న ట్రయల్ కోర్టు అభిప్రాయం సరికాదని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. 

ఒకవేళ ట్రయల్ కోర్టు వాదనను అలాగే కొనసాగిస్తే పీఎంఎల్‌ఏ చట్టం తన ప్రాముఖ్యతను కోల్పోతుందని గతంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ హైప్రొఫైల్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారీ, యంగ్ ఇండియన్ సంస్థ, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఈడీ నిందితులుగా చేర్చింది. 

నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థకు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను, కేవలం రూ.50 లక్షలు చెల్లించి ‘యంగ్ ఇండియన్’ సంస్థ ద్వారా కాంగ్రెస్ నాయకులు అక్రమంగా చేజిక్కించుకున్నారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2012లో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ చట్టపరమైన వివాదం ప్రారంభమైంది.