‘ఎక్స్‌’లో బ్యాంకింగ్ సేవలు

‘ఎక్స్‌’లో బ్యాంకింగ్ సేవలు

ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) తాజాగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అమెరికాలోని ప్రీమియం, ప్రీమియం ప్లస్ యూజర్ల కోసం అధికారికంగా ‘ఎక్స్ మనీ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గత జూన్ చివరి నుంచి పరిమితంగా పరీక్షించిన ఈ ఫీచర్‌ను, ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో వినియోగదారులకు అందిస్తున్నారు.

 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా తీర్చిదిద్దాలనే మస్క్ దీర్ఘకాలిక లక్ష్యంలో ఇదొక మైలురాయిగా నిలిచింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే అనేక ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. డిపాజిట్లు చేసుకోవడం, ఒకరి ఖాతా నుంచి మరొకరికి డబ్బులు బదిలీ చేయడం, బిల్లులు చెల్లించడం, వైర్ ట్రాన్స్‌ఫర్లు మరియు చెక్కులను పంపడం వంటి సేవలను పొందవచ్చు. 

ఈ డిపాజిట్లను న్యూజెర్సీకి చెందిన క్రాస్ రివర్ బ్యాంక్ నిర్వహిస్తుండగా, యూఎస్ ఎఫ్‌డీఐసీ ద్వారా 2.5 లక్షల డాలర్ల వరకు బీమా రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా, ప్రీమియం ప్లస్ మెంబర్లకు ఏడాదికి గరిష్టంగా 6 శాతం వరకు వడ్డీని కూడా ఆఫర్ చేస్తున్నారు. చైనాకు చెందిన ‘వీచాట్’ తరహాలో మెసేజింగ్, పేమెంట్స్, షాపింగ్, బ్యాంకింగ్ వంటి అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నదే ఎలాన్ మస్క్ ప్రధాన ఉద్దేశం. 

ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్ సంస్థ.. పేపాల్‌కు చెందిన వెన్మో, క్యాష్ యాప్, సోఫై వంటి ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే, వినియోగదారులకు అంత భారీ స్థాయిలో వడ్డీ ఎలా చెల్లిస్తారనే అంశంపై అమెరికా సెనేట్ బ్యాంకింగ్ కమిటీ సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు.