బ్రిటన్ దేశానికి తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిగా భారత మూలాలున్న కనిష్క నారాయణ్ బాధ్యతలు స్వీకరించారు. కనిష్క నారాయణ్ను ఏఐ మంత్రిగా నియమిస్తున్నట్లు భారత నూతన ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ మంగళవారం ప్రకటించారు. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ సాంకేతికతలో ప్రపంచస్థాయి అగ్రగామిగా నిలవాలన్న యూకే ప్రభుత్వ లక్ష్యానికి ఈ నియామకం అద్దం పడుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏఐతో ముడిపడిన అవకాశాలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏఐ నియంత్రణ, నైతిక వినియోగం, ఆర్థికవ్యవస్థతో దాని అనుసంధానం వంటి అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ పాలసీ, ఆవిష్కరణల రంగంలో అపార అనుభవం ఉన్న కనిష్క నారాయణ్ నియామకాన్ని ఒక వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు.
కృత్రిమ మేధ మానవ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పరిజ్ఞానంగా మారబోతోందని నారాయణ్ తెలిపారు. దీని ద్వారా బ్రిటన్ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వస్తుందని, జాతీయ భద్రత బలోపేతం కావడంతో పాటు ప్రజా సేవల్లోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలపై ప్రజల్లో ఉన్న ఆందోళనలు కూడా సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూనే, దానితో ముడిపడిన ముప్పులను నివారించడం ఆయన ప్రధాన బాధ్యత కానుంది. కాగా కనిష్క వేల్స్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రధాని ఆండీ బర్న్హామ్ భారత మూలాలున్న ఇద్దరికి తన క్యాబినెట్లో చోటు కల్పించారు. వారిలో కనిష్క నారాయణ్తోపాటు లీసా నాండీ ఉన్నారు.
కనిష్క గతంలో కీర్ స్టార్మర్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆన్లైన్ భద్రత, కృత్రిమ మేథ విభాగాలను పర్యవేక్షించిన ఆయన ఇప్పుడు పూర్తిస్థాయిలో ఏఐ మంత్రిగా నియమితులయ్యారు. బీహార్లో జన్మించిన కనిష్క నారాయణ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన ఆయన, 2025లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక లీసా నాండీ, కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాంచెస్టర్లో జన్మించిన ఆమె తండ్రి దీపక్ నాండీ పశ్చిమబెంగాల్కు చెందిన వారు కాగా, తల్లి బ్రిటన్ జాతీయురాలు. లీసా 2010 నుంచి విగాన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

More Stories
విదేశీ విద్యార్థులు సెప్టెంబర్ 15కు తిరిగి అమెరికా వచ్చేయాలి
ఉక్రెయిన్ ఓడరేవు నౌకపై దాడిలో నలుగురు భారతీయులు మృతి
అమెరికాలో 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం