భారత్, యునైటెడ్ కింగ్డమ్ తమ చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఈటిఎ)ను బుధవారం నుండి అమలులోకి తెచ్చాయి. దీని ద్వారా చాలా భారతీయ ఎగుమతులకు దాదాపు సుంకరహిత ప్రవేశం లభించడంతో పాటు, యూకేలో తాత్కాలిక పనులపై ఉన్న నిపుణులపై విధించే రెట్టింపు సామాజిక భద్రతా చెల్లింపులను కూడా తొలగించారు.
ఈ ఒప్పందం వల్ల తయారీ, వ్యవసాయం, సేవల రంగాలలోని ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, పరిమిత కాలం పాటు బ్రిటన్లో పనిచేసే భారతీయ నిపుణుల ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఉన్న సామాజిక భద్రత ఒప్పందం కూడా బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో దీనిని ఒక “కీలక ఘట్టం”గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్లో, సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం (సీఈటీఎ), అలాగే సామాజిక భద్రతా ఒప్పందం వంటి ఈ కీలక ఒప్పందాలు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, అలాగే రెండు దేశాలలోని వ్యాపార సంస్థలు, కార్మికులు, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను కల్పిస్తాయని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారతదేశ ఎగుమతులలో దాదాపు 99 శాతానికి సుంకరహిత మార్కెట్ ప్రవేశాన్ని కల్పిస్తుందని, అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు పూర్తి విలువను ఇది కవర్ చేస్తుందని తెలిపారు. మంత్రి ప్రకారం, ఈ ఒప్పందం వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాలు, సముద్ర ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం వంటి రంగాలకు అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.
ఎంఎస్ఎంఈలు, రైతులు, తయారీదారులు కూడా లబ్ధి పొందుతారని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సమాచార సాంకేతికత, వృత్తిపరమైన, ఆర్థిక, విద్య, వ్యాపార సేవల రంగాలు యూకే మార్కెట్లోకి మరింతగా ప్రవేశాన్ని పొందుతాయని, అదే సమయంలో భారతీయ నిపుణుల చలనశీలత కూడా విస్తరిస్తుందని గోయల్ తెలిపారు.
ఈ ఒప్పందం ప్రకారం, తాత్కాలిక పనుల మీద యూకేలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, భారతదేశ సామాజిక భద్రతా వ్యవస్థకు తమ చెల్లింపులను కొనసాగించినంత కాలం, ఐదు సంవత్సరాల వరకు రెట్టింపు సామాజిక భద్రతా చెల్లింపులు చేయకుండా మినహాయింపు పొందుతారు. ఈ నిబంధన భారత కార్మిక శక్తి ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని గోయల్ తెలిపారు.
దక్షిణాసియాకు యూకే వాణిజ్య కమిషనర్, భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మాజీ ముఖ్య సంధానకర్త అయిన హర్జిందర్ కాంగ్, ఈ ఏర్పాటు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించే నిపుణులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. “ఇది దేశాల మధ్య రాకపోకలు సాగించే వ్యక్తుల ఆర్థిక స్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది, ఎందుకంటే వారు ఇకపై రెండు విడతలుగా సామాజిక భద్రతా చెల్లింపులు చేయవలసిన అవసరం ఉండదు” అని స్పష్టం చేశారు.
సంప్రదింపుల సమయంలో ఈ మినహాయింపు కాలాన్ని 36 నెలల నుండి 60 నెలలకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందం భారతదేశంలోకి ప్రవేశించే అనేక బ్రిటిష్ ఉత్పత్తులపై సుంకాలను కూడా తగ్గిస్తుంది. అయితే చాలా వస్తువులకు తగ్గింపులు క్రమంగా అమలు చేయబడతాయి. స్కాచ్ విస్కీపై సుంకాలు ప్రారంభంలో 150 శాతం నుండి 75 శాతానికి తగ్గి, రాబోయే దశాబ్దంలో 40 శాతానికి చేరుకుంటాయి.
కోటా ఆధారిత విధానం ద్వారా బ్రిటిష్ ఆటోమొబైల్స్పై సుంకాలు కూడా తగ్గిస్తారు. ఈ ఒప్పందం కింద భారతదేశం 90 శాతం సుంకాల శ్రేణులపై సుంకాలను తగ్గిస్తుంది లేదా పూర్తిగా తొలగిస్తుంది. కాగా ఆ సుంకాల శ్రేణులలో 85 శాతం రాబోయే 10 ఏళ్లలో పూర్తిగా సుంకరహితంగా మారతాయి. 14 విడతల చర్చల అనంతరం, 2025 జూలై 24న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఇది వస్తు, సేవల వాణిజ్యం, డిజిటల్ వాణిజ్యం, ఆర్థిక సేవలు, మేధో సంపత్తి, ఆవిష్కరణ, సుస్థిరత, ప్రభుత్వ సేకరణ వంటి 30 అధ్యాయాలను కలిగి ఉంది. ఉక్కు ఎగుమతులపై ఉన్న ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ, యూకే రక్షణ చర్యలు అన్యాయమైన ధరలతో కూడిన దిగుమతుల నుండి దేశీయ ఉత్పత్తిదారులను కాపాడటానికి రూపొందించాయని, అవి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని కాంగ్ పేర్కొన్నారు.
“యూకే ప్రవేశపెట్టిన ఉక్కు భద్రతా చర్యలు ప్రధానంగా విదేశీ డంపింగ్ నుండి పరిశ్రమను రక్షించడానికి ఉద్దేశించినవి. దీనికి భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఏ విధంగానూ భారత్కు వ్యతిరేకమైన చర్య కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్ ప్రకారం, భారతదేశం ఎగుమతి చేసే ఉక్కు రకాలలో కేవలం 15-20 శాతం మాత్రమే ప్రభావిత విభాగంలోకి వస్తాయి. అయితే అధిక శాతం రవాణా భద్రతా చర్యల పరిధిలోకి రాదు.
యూకే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సిబిఎఎం) వాణిజ్య చర్చలలో ఎప్పుడూ భాగం కాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. “సిబిఎఎం ఎప్పుడూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగం కాదని మేము మొదటి రోజు నుంచే స్పష్టం చేశాము. ఒప్పందంలో భాగంగా దీనిపై చర్చ జరగలేదు. అది వచ్చినప్పుడు, మేము దానిని పరిష్కరిస్తాము,” అని ఆయన తెలిపారు.

More Stories
ఇరాన్ సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న అమెరికా
రెండు దశాబ్దాల తర్వాత కోల్కతా రానున్న తస్లీమా నస్రీన్
రూ.1,27,500 కోట్ల వ్యయంతో సెమికాన్ 2.0కు కేంద్రం ఆమోదం