2025 పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్కు చెందిన లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి) వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్ను అరెస్టు చేసి, కస్టడీలో విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోరిన నేపథ్యంలో, జమ్మూ కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో “నిష్పక్షపాతమైన, సంపూర్ణమైన, సమర్థవంతమైన దర్యాప్తు” కోసం సయీద్ అరెస్టు, విచారణ అవసరమని పేర్కొంటూ, ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ అరుణ్ శర్మ దాఖలు చేసిన దరఖాస్తుపై ప్రత్యేక కోర్టు ఈ ఉత్తర్వు జారీ చేసింది.
ఈ నెల ప్రారంభంలో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో సయీద్ను ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న తర్వాత ఈ వారెంట్ జారీ చేశారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది మరణించిన దాడి వెనుక ఉన్న కుట్రలో అతనికి ప్రమేయం ఉందని ఏజెన్సీ ఆరోపించింది. ఈ కేసులో సయీద్ పరారీలో ఉన్న నిందితుడని, అరెస్టు నుంచి తప్పించుకుంటున్నాడని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
చట్ట ప్రకారం అమలు చేసేందుకు వారెంట్ను డీఐజీ, ఎన్ఐఏ జమ్మూకు పంపాలని కోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద ఉగ్రవాదిగా గుర్తించిన సయీద్, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా వ్యవస్థాపకుడని, పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని కోర్టు గమనించింది.
“నిష్పక్షపాతమైన, సంపూర్ణమైన, సమర్థవంతమైన దర్యాప్తు కోసం సదరు నిందితుడి అరెస్టు, కస్టడీ విచారణ అవసరం,” అని వారెంట్ జారీ చేస్తూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యల ఆవశ్యకతను పేర్కొంటూ, సయీద్పై నిరవధిక తేదీతో కూడిన నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఎన్ఐఏ తన పిటిషన్లో కోరింది.
కోర్టు ఉత్తర్వులో సయీద్కు ఉన్న పలు మారుపేర్లను పేర్కొంటూ, అతడిని పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గల సర్ఘోడా నివాసి అయిన కమల్-ఉద్-దిన్ కుమారుడిగా గుర్తించింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగా అరెస్టును తప్పించుకుంటున్నాడని కూడా అందులో పేర్కొంది. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించడంతో, ఇది భారీ భద్రతా చర్యలకు దారితీసింది.
ఈ కేసులో ఎన్ఐఏ 2025 డిసెంబర్లో తన మొదటి ఛార్జిషీట్ను దాఖలు చేయగా, తదనంతరం దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో విస్తృత కుట్రలో నిందితులలో ఒకరిగా సయీద్ పేరును చేర్చింది. భారత్, అమెరికా దేశాలు హఫీజ్ సయీద్ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తతెలిసిందే. 2008 ముంబై ఉగ్రదాడి కేసులో మాస్టర్మైండ్ కూడా.

More Stories
మూడు మందిర్-మసీదు వివాదాలలో `సుప్రీం’ మధ్యవర్తిత్వం నిరాకరణ
సీఎం ఒమర్ అబ్దుల్లాకు బిజెపి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీస్
ఢిల్లీ అల్లర్లలో ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ నేత