దేశ సరిహద్దుల్లో హైదరాబాద్ గడ్డపై తయారైన ‘ఉగ్రం’ రైఫిల్ 

దేశ సరిహద్దుల్లో హైదరాబాద్ గడ్డపై తయారైన ‘ఉగ్రం’ రైఫిల్ 
 
ఐటీ రంగంలోనే కాకుండా, స్వదేశీ రక్షణ పరికరాల తయారీలోనూ భాగ్యనగరం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ రక్షణ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే, హైదరాబాద్‌కు చెందిన ‘ద్వీప డిఫెన్స్’ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ‘ఉగ్రం’ (7.62×51 మి.మీ.) బ్యాటిల్ రైఫిల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రక్షణ దళాల కొనుగోలు ప్రక్రియకు సిద్ధమైంది. 
 
తెలంగాణ గడ్డపై తయారైన ఒక అత్యాధునిక ఆయుధం దేశ సరిహద్దులను రక్షించే స్థాయికి చేరుకోవడం హైదరాబాద్ రక్షణ రంగానికి గర్వకారణంగా నిలిచింది. డీఆర్డీవోకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎఆర్డీఈ) భాగస్వామ్యంతో ద్వీప డిఫెన్స్ ఈ ‘ఉగ్రం’ రైఫిల్‌ను రూపొందించింది. 
 
కేవలం 100 రోజుల రికార్డు కాలంలోనే ఈ స్వదేశీ బ్యాటిల్ రైఫిల్‌ను డిజైన్ చేసి, ప్రోటోటైప్ సిద్ధం చేయడం రక్షణ రంగంలో హైదరాబాద్ ప్రైవేట్ పరిశ్రమల నైపుణ్యానికి, ప్రభుత్వ పరిశోధన సంస్థల సమన్వయానికి నిదర్శనం. ‘ఉగ్రం’ అసాల్ట్ రైఫిల్ కఠినమైన ఆర్మీ జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్‌మెంట్ (జిఎస్క్యుఆర్) పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
 
వివిధ క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించిన ఫీల్డ్ ఎవాల్యుయేషన్ పరీక్షలను కూడా ఇది అధిగమించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన బోర్డు ట్రయల్స్ సైతం పూర్తి కావడంతో, సీఆర్పీఎఫ్\, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ వంటి ప్రధాన కేంద్ర సాయుధ పోలీసు దళాల కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగుతోందని కంపెనీ తెలిపింది. ద్వీప డిఫెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిబు జోసెఫ్ తెలిపిన వివరాల ప్రకారం కంపెనీకి 2021లో రక్షణ పరికరాల తయారీ లైసెన్స్ లభించింది. 
 

ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో కేటాయించిన 13 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించారు. “మా ప్రయాణం కొద్ది కాలం క్రితమే ప్రారంభమైనప్పటికీ, నేడు హైదరాబాద్ కేంద్రంగా 100కు పైగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు కోర్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేశాం. అందులో ఉగ్రం రైఫిల్ మా ప్రైడ్ ప్రొడక్ట్” అని సిబు జోసెఫ్ వెల్లడించారు.

ఈ అత్యాధునిక రైఫిల్ పూర్తి గ్యాస్-ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్ వ్యవస్థతో పనిచేస్తుంది. సైనికుల సౌకర్యం కోసం దీని బరువును నాలుగు కిలోల కంటే తక్కువగానే ఉంచడం విశేషం. దీని ప్రభావవంతమైన ఫైరింగ్ రేంజ్ 500 మీటర్లుగా నిర్ధారించారు. కఠిన పర్వత ప్రాంతాల్లో, మంచు తుఫానుల్లో మరియు తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో కూడా నిరాటంకంగా పనిచేసేలా దీనికి సంబంధించిన విశ్వసనీయత పరీక్షలు పూర్తయ్యాయి.

 
2018లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ద్వీప డిఫెన్స్ కేవలం ‘ఉగ్రం’ బ్యాటిల్ రైఫిల్‌కే పరిమితం కాలేదు. యూ-19 సబ్‌మెషిన్ గన్, అత్యంత తేలికపాటి మెషిన్ గన్, యూ-45 అసాల్ట్ రైఫిల్, యూ-39 ప్లాట్‌ఫామ్, అలాగే ఉగ్రం రైఫిల్ ఆధారిత యాంటీ-డ్రోన్ వ్యవస్థలను సైతం హైదరాబాద్‌లోనే తయారు చేస్తోంది. అత్యంత సంక్లిష్టమైన ఆయుధ పరిజ్ఞానం కలిగిన హైదరాబాద్ నేడు గ్లోబల్ డిఫెన్స్ తయారీ మ్యాప్‌లో మరింత బలమైన ముద్ర వేస్తోంది. 
 
రక్షణ రంగంలో హైదరాబాద్ పోషిస్తున్న కీలక పాత్రకు, ఇక్కడి నుంచి రూపుదిద్దుకున్న ‘ఉగ్రం’ రైఫిల్ సాధించిన విజయమే పెద్ద నిదర్శనం. స్వదేశీ తయారీ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఏ విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదో ఈ విజయం నిరూపిస్తోంది. దేశ భద్రతా దళాల అమ్ములపొదిలో చేరనున్న హైదరాబాద్ బ్రాండ్ ఆయుధం ‘ఉగ్రం’ భవిష్యత్తులో రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించనుంది.