శ్రీలంకలోని ఒక ప్రధాన జైలులో రెండు డ్రగ్స్ ముఠాల (డ్రగ్ గ్యాంగ్స్) మధ్య జరిగిన ఘోర ఘర్షణలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ హింసాత్మక అల్లర్లలో ఏడుగురు జైలు సిబ్బందితో సహా మొత్తం 26మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో శ్రీలంక జైళ్ల చరిత్రలోనే జరిగిన అత్యంత ఘోరమైన అల్లర్ల ఘటన ఇదేనని అధికారులు సోమవారం ప్రకటించారు.
కొలంబో ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ పుష్ప గమ్లత్ తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన వారి శరీరాలపై బుల్లెట్ గాయాలు, కత్తిపోట్లు మరియు తీవ్రమైన ముష్టిఘాతాల గుర్తులు ఉన్నాయి. జైలులోని ఒక సెక్షన్లో మొదలైన ఈ ఘర్షణలు వేగంగా ఇతర విభాగాలకు కూడా వ్యాపించాయి. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని పక్కనే ఉన్న మహిళా ఖైదీల బ్యారక్స్లోని ఖైదీలు ఆదివారం రాత్రి జైలు పైకప్పుపైకి ఎక్కి తమను తక్షణమే విడుదల చేయాలంటూ నిరసనకు దిగారు.
అయితే, ఆందోళనల తీవ్రతకు పైకప్పులో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు మహిళా ఖైదీలు కూడా గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు అనిపించినా, సోమవారం ఉదయం మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఖైదీలు జైలు లోపల తిరుగుబాటు చేయడంతో జైలు వెలుపల భారీగా పోలీసు కమాండోలను మోహరించారు.
అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంతో సంబంధం ఉన్న రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య తొలి ఘర్షణ చెలరేగిందని న్యాయశాఖ మంత్రి హర్షన నానాయక్కర తెలిపారు. ఈ అల్లర్ల సమయంలో జైలులోని సీసీటీవీ వ్యవస్థలు, బాడీ స్కానర్ పూర్తిగా ధ్వంసమయ్యాయని వారి ప్రధాన ఉద్దేశం జైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమేనని స్పష్టం చేశారు. హింసకు పాల్పడిన ఖైదీలను మరో రెండు జైళ్లకు తరలించినట్లు ఆయన చెప్పారు.
భద్రతా నిఘా కోసం వైమానిక దళానికి చెందిన డ్రోన్లు, హెలికాప్టర్ను రంగంలోకి దించారు. శ్రీలంక దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ప్రస్తుతం 41,250 మంది ఖైదీలు ఉన్నారు. ఇది అక్కడి జైళ్ల అసలు సామర్థ్యం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ఈ మితిమీరిన రద్దీ, గ్యాంగ్ వార్లే తాజా రక్తపాతానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

More Stories
ఇజ్రాయెల్కు అమెరికానే కాదు… భారత్ కూడా మిత్రదేశం
పీఓకెలో 600 మందికి పైగా అరెస్ట్…. భారీగా పాక్ వ్యతిరేక నిరసనలు
థాయ్లాండ్ కు పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల చెల్లుబాటు అవసరం