మణిపూర్‌లో సైనిక కాన్యాయ్‌ను ఐఈడీతో పేల్చివేత.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌లో సైనిక కాన్యాయ్‌ను ఐఈడీతో పేల్చివేత.. ఇద్దరు జవాన్లు మృతి
జాతుల మధ్య వైరంతో అట్టుడికి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితులు కుదుటపడుతున్న సమయంలో  సోమవారం మధ్యాహ్నం ఉఖరుల్ జిల్లాలో 40 అస్సాం రైఫిల్స్‌కు చెందిన సైనిక కాన్వాయ్‌ను ఐఈడీతో సాయంతో  ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందిన, పలువురు గాయపడ్డారు. 
 
జిల్లా కేంద్రం ఉఖరుల్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి 202పై ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ దాడిలో వారెంట్ ఆఫీసర్ బల్వంత్ సింగ్, రైఫిల్‌మ్యాన్ సీఎం సింగ్‌‌ అమరులైనట్టు అధికారులు తెలిపారు. 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి అనంతరం భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 

కాగా, ఉఖ్రుల్ జిల్లాలోని లంబూయి గ్రామంలో మోహరించిన సుమారు 40 మంది అస్సాం రైఫిల్స్ సిబ్బంది న్యూ హెవెన్‌లో ఒక అవుట్‌పోస్ట్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపకుండా అవుట్‌పోస్ట్‌ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహించారు.  ఆదివారం మహిళలు, విద్యార్థి సంఘాలతో సహా స్థానికులు నిరసన తెలిపారు. అవుట్‌పోస్ట్‌ నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు నిరసన చేస్తున్న జన సమూహాన్ని నియంత్రించేందుకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది లాఠీచార్జ్‌తో పాటు పలు రౌండ్లు కాల్పులు జరిపారు.  ఈ సందర్భంగా నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత మిలిమెంట్లు మెరుపుదాడి చేయడంతో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించగా పలువురు గాయపడ్డారు.

ఉగ్రవాదుల క్రూరమైన చర్యలను తీవ్రంగా ఖండించిన మణిపూర్ ముఖ్యమంత్రి ఖేమచంద్ సింగ్  అమరులైన జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించదని, బాధ్యులను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించేలా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సమాజంలో ఇటువంటి హింసకు స్థానం లేదని, శాంతిభద్రతలను కాపాడాలనే సామూహిక సంకల్పాన్ని ఇవి బలహీనపరచలేవని చెప్పారు.  కాన్వాయ్‌పై దాడిని మణిపూర్ హోం మంత్రి గోవిందాస్ కొంతౌజం ఖండిస్తూ  ఇలాంటి దాడులు మనమంతా ఆకాంక్షించే శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.