అత్యంత నాణ్యమైన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడి పండ్లను వాణిజ్యపరంగా తొలిసారి సముద్ర మార్గం ద్వారా సింగపూర్కు విజయవంతంగా పంపారు. కేంద్ర వాణిజ్య శాఖ పర్యవేక్షణలో ఏపీ రైతుల నుంచి సేకరించిన ఐదు టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేశారు. జూన్ 11న బయలుదేరిన ఈ నౌక జూన్ 24న సింగపూర్ చేరుకుంది. జల మార్గం ద్వారా తాజా పండ్లను విదేశాలకు పంపడం భారత్లో ఇదే మొదటిసారి.
ఈ చొరవ వల్ల తక్కువ ఖర్చుతో పర్యావరణహితంగా ఎగుమతులు చేసే అవకాశం పెరిగింది. ఆంధ్ర మామిడి సింగపూర్ ఎగుమతి ప్రక్రియ విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఎగుమతి ద్వారా ఏపీ రైతులకు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయి. స్థానిక మార్కెట్లో మామిడి కిలో ధర సాధారణంగా రూ. 25 నుండి రూ. 26 వరకు ఉంటుంది. కానీ ఈ ఎగుమతి ప్రక్రియ వల్ల రైతులకు కిలోకు రూ. 50 వరకు దక్కింది.
అంటే సాధారణ అమ్మకాల కంటే రెట్టింపు ఆదాయం లభించింది. ఏపీలోని అత్యుత్తమ తోటల నుంచి పండ్లను సేకరించి, ప్యాక్హౌస్లలో శుద్ధి చేయడం వల్ల పండ్ల నాణ్యత తగ్గకుండా సింగపూర్ చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన మామిడి పండ్లకు ఉన్న గిరాకీని ఇది మరోసారి నిరూపించింది. రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కడంతో ఉద్యానవన శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
సింగపూర్లోని ఈసీ-లింక్స్ సంస్థ మన మామిడి పండ్ల నాణ్యతను ఎంతగానో మెచ్చుకుంది. పండ్ల తీపిదనం, పక్వానికి వచ్చే విధానం, ఎక్కువ రోజులు నిల్వ ఉండే గుణం అద్భుతంగా ఉన్నాయని వారు తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో కోత కోయడం, కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ వాడటం ఈ విజయానికి కారణమయ్యాయి. వాయు మార్గంతో పోలిస్తే సముద్ర మార్గంలో ఖర్చు చాలా తక్కువ. ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అపెడా చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. బంగినపల్లి మామిడి పండు తన అద్భుతమైన రుచితో ప్రపంచ వేదికపై తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకుంది.

More Stories
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్
బిజెపి `జనతా వారధి’లో కల్తీ ఆహారం, ఆహార భద్రతపై ఆందోళన
రాయచోటి `రహస్య జీవనం’లో హిందూ ప్రముఖుల హత్యకు ఆలీ కుట్ర!