సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ ‘అకాల్ తఖ్త్’ సిక్కు వ్యతిరేకిగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను ప్రకటిస్తూ కఠినమైన తీర్పునిచ్చిన వివాదం ముగియకముందే ఆయననుకాపాడేందుకు పంజాబ్ ప్రభుత్వ పెద్దలు ఏకంగా ఒక నకిలీ ఫోరెన్సిక్ నివేదికను సృష్టించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఈ వ్యవహారంలో హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో రంగంలోకి దిగిన బీజేపీ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సంచలనమైన డిమాండ్ను లేవనెత్తింది. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో సీఎం భగవంత్ మాన్ సిక్కు గురువుల చిత్రపటాలపై మద్యం చిలకరిస్తున్నట్లు ఉన్న విజువల్స్ సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
దీనిని తీవ్రంగా పరిగణించిన అకాల్ తఖ్త్ గత వారం ఆయనను దోషిగా తేల్చింది. అయితే ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి మాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన నివేదికను విడుదల చేస్తూ ఆ వీడియోలో ఉన్నది ముఖ్యమంత్రి కాదని, అది మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియో అని క్లీన్ చిట్ ఇచ్చుకుంది. ఈ ఫోరెన్సిక్ నివేదిక వెనుక పెద్ద కుట్ర దాగుందంటూ గురుగ్రామ్ పోలీసులు గుట్టురట్టు చేశారు.
ఒక ప్రముఖ సైబర్ నిపుణుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఢిల్లీకి చెందిన అంకిత్, పంచకులకు చెందిన అరుణ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పంజాబ్ ప్రభుత్వ ఉన్నతాధికారులమని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని, వీడియోలో ఉన్నది సీఎం కాదని తేల్చేలా ముందే రాసుకున్న నివేదికపై సంతకం చేయాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.
ఈ ఫోర్జరీ నివేదిక కోసం గురుగ్రామ్లోని ఒక హోటల్లో రూ. 10 లక్షల నగదు ఆఫర్ చేశారని, నివేదికను తమకు అనుకూలంగా మార్చేందుకు పలుమార్లు మార్పులు చేయించారని సంచలన నిజాలు బయటపెట్టాడు.
పంజాబ్ తన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నైతిక, రాజ్యాంగ సంక్షోభాలలో ఒకదానిని ఎదుర్కొంటోందని పేర్కొంటూ, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ మాన్ రాజీనామాను డిమాండ్ చేశారు. “పంజాబ్ గౌరవం పణంగా ఉంది. పంజాబ్ గౌరవానికి అండగా నిలవాలా లేక ‘గురు-ద్రోహి’గా ప్రకటించబడిన వ్యక్తి పక్షాన నిలవాలా అన్న విషయాన్ని ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, అధికారి నిర్ణయించుకోవాలి,” అని ఆయన సూచించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ భగవంత్ మాన్కు క్లీన్ చిట్ ఇప్పించడం కోసం లూథియానా పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ, ఎస్పీ జషందీప్ సింగ్ వంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారులను ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
నిందితులకు, పంజాబ్ పోలీస్ అధికారులకు మధ్య నడిచిన వాట్సాప్ చాట్లను, హోటల్లో జరిగిన మనీ డీలింగ్ ఆధారాలను ఆయన మీడియా ముందుంచారు. “భగవంత్ మాన్ తన అధికార బలంతో, డబ్బు మదంతో పవిత్రమైన అకాల్ తఖ్త్ను, సిక్కు సమాజాన్ని అవమానించారు. ఫోరెన్సిక్ రిపోర్టులనే ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారారు. ఈ మొఘల్ మైండ్సెట్ ప్రభుత్వ సీఎంను వెంటనే జైల్లో పెట్టాలి. దీనిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు నోరు విప్పడం లేదు?” అని సిర్సా ప్రశ్నించారు.

More Stories
ఈ-20ని ప్రశ్నించిన నలుగురిపై ఎఫ్ఐఆర్లు
ఎన్డీయే వైపు మొగ్గు చూపుతున్న శరద్ పవార్
మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలి