టిఎంసి అధినేత్రిగా మమతా తొలగింపు… కొత్త అధ్యక్షుడిగా అరూప్ రాయ్

టిఎంసి అధినేత్రిగా మమతా తొలగింపు… కొత్త అధ్యక్షుడిగా అరూప్ రాయ్
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీని, రీటాబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సోమవారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. రీటాబ్రత నేతృత్వంలోని వర్గం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో కొంతమంది పార్టీ కౌన్సిలర్లతో కలిసి సమావేశమైం సీనియర్ నేత అరూప్ రాయ్ను తమ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.  
 
అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ వర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించారు.  అందిన సమాచారం ప్రకారం, కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో జరిగిన రహస్య సమావేశంలో 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. “అసలైన” టీఎంసీకి సంబంధించి కొత్తగా ఏర్పడిన జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన అరూప్ రాయ్ నియమితులయ్యారు. 
 
ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లు ఉపాధ్యక్షులుగా ఎంపిక కాగా, రిటబ్రత బెనర్జీ, బిప్లబ్, జావేద్ అహ్మద్ ఖాన్,  సందీపన్ సాహాలు ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ సమావేశంలో కోల్‌కతా, బహరంపూర్, ఉత్తరపారా, శ్రీరాంపూర్, దమ్‌దమ్‌లకు చెందిన సుమారు 40 మంది కౌన్సిలర్లు పాల్గొనడం కనిపించింది. 
 
“ఇది అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం. పది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం,” అని మాజీ టీఎంసీ ఎమ్మెల్యే దేబాసిష్ కుమార్ మీడియాతో పేర్కొన్నారు.   “అరూప్ రాయ్‌ను పార్టీ ఛైర్మన్‌గా నియమించారు. పది మంది సభ్యుల కమిటీలో ఇతరులకు వివిధ పదవులు ఇచ్చారు. పాత, కొత్త తృణమూల్ కాంగ్రెస్ అంటూ ఏమీ లేదు. మేమంతా తృణమూల్ కాంగ్రెస్,” అని సమావేశంలో ఉన్న ఒక సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు.  
 
హాజరైన వారి సమాచారం ప్రకారం, వేదికపై తృణమూల్ కాంగ్రెస్ పేరు, పార్టీ చిహ్నం, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలు అలంకరించారు. అయితే, చాలా కాలంగా పార్టీకి ప్రధాన ముఖాలుగా ఉన్న మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల ఛాయాచిత్రాలు మాత్రం అక్కడ కనిపించలేదు.
 
అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత పార్టీ శాసనసభ, పార్లమెంటరీ విభాగాలలో వరుసగా తలెత్తిన తిరుగుబాట్ల కారణంగా పార్టీ అధినేత్రి, వ్యవస్థాపక చైర్‌పర్సన్ మమతా బెనర్జీకి సంస్థపై ఉన్న పట్టు సన్నగిల్లుతున్న తరుణంలో, ఈ పరిణామం ఆమెకు అత్యంత ప్రత్యక్షమైన సంస్థాగత సవాలుగా నిలిచింది.