బీహార్‌లో నీట్ లో ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ తరహా కుంభకోణం

బీహార్‌లో నీట్ లో ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ తరహా కుంభకోణం
* అభ్యర్థులకు బదులు మెడికల్‌, నర్సింగ్‌ విద్యార్థులు.. 30 మంది అరెస్ట్ 
 
బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో జరిగిన నీట్ యుజి 2026 పునఃపరీక్ష సందర్భంగా పరీక్షా అవకతవకలకు సంబంధించిన ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది.  మున్నా భాయ్ ఎంబీబీఎస్’ సినిమా తరహాలో  అభ్యర్థులకు బదులు కొందరు మెడికల్‌, నర్సింగ్‌ విద్యార్థులు నీట్‌ పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ ఉద్యోగులు వీరికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
 
కఠినమైన భద్రతా ఏర్పాట్లు, ఏడు అంచెల పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ, అధికారులు ఒక ముఠా కార్యకలాపాలను గుర్తించి, అసలు అభ్యర్థుల తరపున పరీక్ష రాస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పై మందిని అరెస్టు చేశారు. పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ ఉద్యోగులు వీరికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పై మందితో పాటు, బయోమెట్రిక్ ధృవీకరణ బాధ్యత కలిగిన ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఏడుగురు ఉద్యోగులను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. డబ్బు తీసుకుని పరీక్ష రాసేలా వ్యక్తులను ఏర్పాటు చేసే ఒక పెద్ద నెట్‌వర్క్‌లో నిందితులు భాగమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
 
పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మూడవ సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే మెడికల్ విద్యార్థి, నీట్‌ అభ్యర్థికి బదులు పరీక్ష రాసేందుకు హసన్‌పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. బయోమెట్రిక్ సంస్థ ఉద్యోగిగా నమ్మించి లోనికి ప్రవేశించాడు. పరీక్షా నిర్వాహకులు అనుమానించడంతో తొలుత మయాంక్ కశ్యప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
అతడి సమాచారం ఆధారంగా లఖీసరాయ్‌లోని కేఆర్‌కే హయ్యర్ సెకండరీ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్‌ సెంటర్స్‌పై పోలీసులు రైడ్‌ చేశారు. దీంతో అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాస్తున్న ప్రాక్సీ నెట్‌వర్క్ గుట్టురట్టయ్యింది.  దీంతో  ఏడుగురు అసలు అభ్యర్థులు, బయోమెట్రిక్ సంస్థకు చెందిన 14 మంది ఉద్యోగులతో సహా మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా, అసలు అభ్యర్థుల స్థానంలో శిక్షణ పొందిన సాల్వర్‌లతో పరీక్ష రాయించేందుకు ఈ చీటింగ్‌ ముఠా ప్లాన్‌ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గయలోని ఏఎన్‌ఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన మెడికల్ విద్యార్థి అర్పిత్ రాజ్ ఈ నెట్‌వర్క్ సూత్రధారులలో ఒకరని అనుమానిస్తున్నారు. గతంలో 2024 నీట్‌ పేపర్ లీక్ కేసులో కూడా సీబీఐ అతడ్ని విచారించినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.