తెలంగాణలో ప్రముఖ దేవస్థానమైన కొమురవెల్లి మల్లన్న ఆలయానికి అతి దగ్గర్లో కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు లకుడారం – దుద్దెడ మధ్య రైల్వే శాఖ కొమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ను నిర్మిస్తోంది.
ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 99 శాతం పూర్తి అయ్యాయని కిషన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2024 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా, రూ. 5.63 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించారు. రైల్వే ప్రయాణికుల కోసం ఈ కొమురవెళ్లి స్టేషన్లో పలు అత్యాధునిక వసతులను కల్పించారు.
450 మీటర్ల పొడవైన హై లెవల్ ప్లాట్ఫారమ్, 5 షెల్టర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్లు, తాగునీటి వసతి, మహిళలు, పురుషులు, దివ్యాంగులకు స్పెషల్ మరుగుదొడ్లను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్కు మెరుగైన అప్రోచ్ రోడ్లు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ఆర్కిటెక్చరల్ ఎలివేషన్, మల్లన్న స్వామి, స్థానిక ప్రకృతి అందాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించారు. ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తులు మల్లన్న దేవాలయానికి సులభంగా, నేరుగా చేరుకునే అవకాశం కలగనుంది.
రాజీవ్ రహదారికి (ఎస్హెచ్-1) సమీపంలో ఈ రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ప్రయాణం మరింత సజావుగా సాగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో రూపుదిద్దుకున్న ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ద్వారా తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా ఆధ్యాత్మిక పర్యాటకానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఖజానా నింపుకోవడానికే భూముల ధరల పెంపు
భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్