క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ఏర్పాటు 

క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ఏర్పాటు 
యూకే- భారతదేశం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో, భారతదేశ శాస్త్ర సాంకేతిక శాఖ మద్దతుతో, యూకే–ఇండియా క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ అబ్జర్వేటరీ అనే ఒక ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ అబ్జర్వేటరీ రెండవ దశలో, భారతదేశంలోని ధన్‌బాద్‌లోని టెక్స్‌మిన్–ఐఐటి(ఐఎస్ఎం)లో ఒక ఉపగ్రహ అబ్జర్వేటరీని  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి యూకే విదేశాంగ కార్యదర్శి ఇవెట్ కూపర్ తో కలసి ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, స్థిరమైన, విశ్వసనీయమైన క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ వ్యవస్థ నిర్మాణంలో ఈ అబ్జర్వేటరీ కీలక పాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికతలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారుతున్నాయని చెప్పారు.  ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పనలో ఈ అబ్జర్వేటరీ ముఖ్య కేంద్రంగా నిలవనుందని వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ లక్ష్యంతోనే 4 బిలియన్ డాలర్ల జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించామని చెప్పారు. మినరల్స్ వెలికితీత, ఎక్స్‌ప్లొరేషన్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఇన్నొవేషన్స్ వంటి విషయాల్లో వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు.

క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు 180 మిలియన్ డాలర్ల ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాల నుంచి విలువైన మినరల్స్, విదేశాల్లో మినరల్స్‌ను తవ్వడం వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు.

మినరల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ-ఆక్షన్, ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు, జూనియర్ మైనింగ్ కంపెనీలకు అవకాశాలు కల్పిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.   బ్రిటిష్ పరిశ్రమలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ సంస్థలు భారత క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. 

 
యూకేకు ఉన్న మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ట్రాక్షన్ టెక్నాలజీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాల వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఈ అబ్జర్వేటరీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిటికల్ మినరల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు ఈ అబ్జర్వేటరీ విలువైన సమాచారం అందిస్తుందని చెప్పారు.