జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్షను ‘కంప్యూటర్ ఆధారిత పరీక్ష’ (సీబీటీ) విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలని జస్టిస్ పీఎస్ నరిసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తర్వాత ఎంపీ సుధాకర్ సింగ్ సహా, ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది.
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షను తిరిగి (రీటెస్ట్) జూన్ 21న నిర్వహించేందుకు ఎన్టీఏ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా పరీక్షను సీబీటీ విధానంలో జరపాలని కోరుతూ ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
వీటిపై విచారణ జరుపుతూ, పిటిషనర్ల తరఫున హాజరైన అడ్వకేట్ సత్యం సింగ్ రాజ్పుత్ను ఉద్దేశించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “రీ-ఎగ్జామినేషన్ సీబీటీ విధానంలో నిర్వహించే ప్రశ్నే లేదు. ఎన్టీఏ ఇప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. నీట్ పరీక్ష రద్దు అయ్యింది కనుక ఇప్పుడు దానిని మళ్లీ నిర్వహిస్తున్నారు. కనుక ఈ పిటిషన్ను మేము ఇప్పుడే కొట్టివేయాలా లేదా వేసవి సెలవుల తర్వాత కొట్టివేయాలా?” అని ప్రశ్నించింది.
దీనిపై న్యాయవాది సత్యం సింగ్ రాజ్పుత్ స్పందిస్తూ, “మేము నీట్-రీటెస్ట్ను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాం. మరేమీ కాదు” అని తెలిపారు. అయితే ఇలాంటి పిటిషన్లను గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.
కాగా, వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి ఎన్టీఏ స్థానంలో మరింత బలమైన, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని లేదా ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం వాటిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఏ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో, తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని, వచ్చే ఏడాది నుంచి పెన్-అండ్-పేపర్ విధానానికి బదులుగా సీబీటీ విధానంలో నీట్-యూజీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

More Stories
కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
గాజియాబాద్లో విద్యార్థి హత్యకేసులో నిందితుడి ఎన్కౌంటర్
రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం