లడఖ్‌లో “ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం”లో కీలక ముందడుగు

లడఖ్‌లో “ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం”లో కీలక ముందడుగు
ఒక కీలక ముందడుగులో, లడఖ్‌లో “ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం”, నాగాలాండ్, సిక్కిం, మిజోరంలకు వర్తించే “ఆర్టికల్స్ 371ఏ, 371ఎఫ్, 371జి  తరహాలో రాజ్యాంగ రక్షణలను కల్పించడం”పై కేంద్ర ప్రభుత్వంతో ఒక “సూత్రప్రాయమైన” అవగాహనకు వచ్చినట్లు ‘లే అపెక్స్ బాడీ’ (ఎల్ఏబి),  ‘కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్’ (కేడీఏ) శుక్రవారం ప్రకటించాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంఎచ్ఏ), లడఖ్ నాయకుల మధ్య ఉప-కమిటీ స్థాయి చర్చలు శుక్రవారం న్యూఢిల్లీలో జరిగాయి. 
 
లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, ఆరవ షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణలు పొందడం వంటి నాలుగు అంశాల అజెండాపై, 2021 నుండి ‘లే అపెక్స్ బాడీ’,  ‘కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్’ కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. ఎల్ఏబి, కేడీయే  తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం జరిగిన సమావేశంలో లడఖ్ ప్రజల చిరకాల ఆకాంక్షలైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజ్యాంగ రక్షణలు, రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ రక్షణల డిమాండ్లను వారు మరోసారి బలంగా వినిపించారు. 
 
ప్రస్తుతం నాగాలాండ్, సిక్కిం, మిజోరంలలో అమలులో ఉన్న ఆర్టికల్స్ 371ఏ, 371ఎఫ్, 371జి తరహాలో రాజ్యాంగ రక్షణలను కల్పించేందుకు ఒక అవగాహన కుదిరినట్లు ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి. ఈ రాజ్యాంగ నిబంధనలు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక రక్షణలను, భద్రతలను కల్పిస్తాయి. “విస్తృతమైన, నిర్మాణాత్మక చర్చల” అనంతరం, పలు కీలక అంశాలపై ఇరు పక్షాలు ఒక సూత్రప్రాయమైన అవగాహనకు వచ్చినట్లు ఆ రెండు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 
 
ప్రతిపాదిత నమూనా ప్రకారం, కేంద్ర పాలిత ప్రాంత స్థాయి శాసన మండలి ద్వారా శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాలు ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో ఉంటాయని వారు పేర్కొన్నారు. “కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరూ, కేంద్ర పాలిత స్థాయి ఎన్నికైన మండలి కార్యనిర్వాహక అధిపతి (ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన వ్యక్తి) నియంత్రణలో ఉంటారు,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
సమావేశం సందర్భంగా, లడఖ్‌కు ప్రస్తుతం పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించలేకపోవడానికి ఏకైక కారణం, “ఉద్యోగుల జీతభత్యాల వంటి ఖర్చులను భరించడానికి అవసరమైన తగినంత ఆదాయ వనరులు ప్రస్తుతం అక్కడ లేకపోవడమే” అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. “అయితే, ఆదాయ వనరులకు సంబంధించిన నిర్దేశిత ప్రమాణాలను లడఖ్ చేరుకున్న వెంటనే, ఈ వ్యవస్థ దానిని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా దిశగా నడిపిస్తుంది,” అని ఆ రెండు సంస్థలు పేర్కొన్నాయి. 
 
ఈ ప్రతిపాదనపై మరింత లోతుగా చర్చించడానికి భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు జరుగుతాయని ఎల్ఏబి సహ-అధ్యక్షుడు చెరింగ్ దోర్జే లక్రుక్  తెలిపారు. “తదుపరి సమావేశానికి ఇంకా తేదీ ఖరారు కాలేదు, కానీ చర్చలు కొనసాగుతాయి,” అని ఆయన చెప్పారు. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదించి, హోం మంత్రిత్వ శాఖతో కలిసి కార్యాచరణకు సంబంధించిన సూక్ష్మ వివరాలను ఖరారు చేయడానికి ఎదురుచూస్తున్నామని కేడీఏ, ఎల్ఏబీ పేర్కొన్నాయి. 
 
ఈ చర్చలు “నిర్మాణాత్మకంగా, సానుకూలంగా, ఆశాజనకంగా, స్వేచ్ఛగా” జరిగాయని లడఖ్ ముఖ్య కార్యదర్శి ఆశిష్ కుంద్రా తెలిపారు. “లడఖ్‌లో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, ఈ చర్చలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగాయి,” అని ఆయన పేర్కొన్నారు.  శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి హాజరైన లడఖ్ బీజేపీ నాయకుడు, లేహ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్  మాజీ ఛైర్మన్ తాషి గ్యాల్సన్ మాట్లాడుతూ, “చాలా కాలం తర్వాత లడఖ్‌కు ఆచరణాత్మకమైన, సుస్థిరమైన ఒక ఆచరణయోగ్యమైన పరిష్కారం ప్రతిపాదించబడింది,” అని తెలిపారు.
 
 అనుభవజ్ఞుడైన లడఖీ నాయకుడు, లేహ్ అపెక్స్ బాడీ మాజీ ఛైర్మన్, తుప్‌స్టన్ ఛెవాంగ్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 కింద లడఖ్‌కు హోదా కల్పించే ఒప్పందంతో పాటు, “స్థానిక సంస్థలకు అర్థవంతమైన ఆర్థిక, పరిపాలనా సాధికారత, ముఖ్యమంత్రితో సమానమైన హోదా కలిగిన నాయకుడితో కూడిన ఎన్నికైన కేంద్రపాలిత ప్రాంత స్థాయి శాసనసభ” ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఒక “చారిత్రాత్మక ముందడుగు” అని చెప్పారు.
 
“ఈ రోజు నిజమైన ఆశను రేకెత్తించింది,” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 30న లడఖ్‌లో పర్యటించడానికి ముందే లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ సమావేశ తేదీని ముందే ప్రకటించారు. ఈ ఉపసంఘానికి హోం మంత్రిత్వ శాఖ, లడఖ్ పరిపాలన విభాగానికి చెందిన సీనియర్ అధికారులు అధ్యక్షత వహిస్తున్నారు. 
 
మార్చిలో సక్సేనా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఉపసంఘ స్థాయి సమావేశం ఇది. కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన కేంద్రం లడఖ్‌పై ఒక ఉన్నత స్థాయి కమిటీని (హెచ్‌పీసీ) ఏర్పాటు చేసింది. హెచ్‌పిసీ చివరి సమావేశం ఫిబ్రవరి 4న న్యూఢిల్లీలో జరిగింది, ఆ తర్వాత తక్షణ తదుపరి సమావేశం ఏదీ నిర్వహించలేదు.