ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో నోరో వైరస్ కలకలం రేగింది. ఫోర్ట్ లాడర్డేల్ నుండి బయలుదేరిన ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో 100 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది నోరోవైరస్ బారినపడ్డారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గురువారం తెలిపింది. కరేబియన్ ప్రిన్సెస్ నౌకలో మొత్తం 102 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది అనారోగ్యానికి గురైనట్లు సిడిసి వెల్లడించింది. మొత్తంగా 115 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
నౌకను శుభ్రపరిచడం, క్రిమిసంహారక ప్రక్రియలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. మల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణం మొత్తం సమయంలో కేసులు క్రమంగా పెరిగాయి. ఒక్కసారిగా కాకుండా దశలవారీగా ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
మొత్తం ప్రయాణికుల్లో 3 శాతానికి మించి కేసులు నమోదుకావడంతో సిడిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తూర్పు కరేబియన్ గుండా 14 రోజుల పాటు సాగిన సముద్రయానంలో కరేబియన్ ప్రిన్సెస్ నౌకలోని 3,116 మంది ప్రయాణికులలో 102 మంది అత్యంత అంటువ్యాధి అయిన కడుపు వైరస్ బారిన పడ్డారు. ఈ నౌక ఏప్రిల్ 29న పోర్ట్ ఎవర్గ్లేడ్స్ నుండి బయలుదేరి, మే 11న పోర్ట్ కెనవెరాల్కు చేరుకోవాల్సి ఉంది.
ప్రయాణంలో భాగంగా ఓడ అరుబా, బొనైర్, ప్యూర్టో రికో, బహామాస్ వంటి పర్యాటక ప్రాంతాల్లో ఆగింది. ఈ సమయంలోనే ప్రయాణికుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. సిడిసి (వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం) వివరాల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అతిసారం, వాంతుల వ్యాప్తికి నోరోవైరస్ ప్రధాన కారణం. ఇది ఇతరులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా, వైరస్తో కలుషితమైన ఆహారం, ద్రవాలను సేవించడం ద్వారా, అలాగే కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.
ఉపరితలాలను క్రిమిరహితం చేయడం, తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా నోరోవైరస్ను నివారించవచ్చని సిడిసి పేర్కొంది. నోరోవైరస్ అనేది కడుపు, ప్రేగులకు సోకే అత్యంత అంటువ్యాధి వైరస్. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మూసి ఉన్న, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే క్రూయిజ్ షిప్లలో ఇలాంటి వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి.

More Stories
అమెరికాకు దడపుట్టిస్తున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
ఆపరేషన్ సిందూర్లో పాక్కు సహాయం.. ఒప్పుకున్న చైనా!
చైనాలో మగవారితో మహిళల లోదుస్తుల మోడలింగ్