గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు కమలం వికాసం 

గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు కమలం వికాసం 
 
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన చారిత్రక విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం కొనియాడుతూ “గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు ఇప్పుడు కమలం వికసించిందని” ఆయన ప్రకటించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తల విజయోత్సవంలో ప్రసంగించిన ప్రధాని మోదీ, గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల అనంతరం తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. 
 
గంగా నదీ పరీవాహక ప్రాంతమంతటా ఇప్పుడు పార్టీ విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. “గత ఏడాది నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు, ఇదే వేదిక నుండి, బీజేపీ ప్రధాన కార్యాలయం నుండే నేను ఒక మాట చెప్పాను—గంగా నది బీహార్ నుండి గంగాసాగర్ వైపు ప్రవహిస్తుందని. ఈ రోజు, బెంగాల్‌లో సాధించిన విజయంతో, గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు—ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌తో సహా—అన్ని చోట్లా కమలం వికసించింది” అని చెప్పారు. 
 
“నేడు, గంగా నదీ తీరంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి” అని గుర్తు చేశారు. ఈ ప్రజా తీర్పును చారిత్రకమైనదిగా అభివర్ణించిన ప్రధానమంత్రి, బెంగాల్ భవిష్యత్తులో ఇది ఒక “కొత్త అధ్యాయానికి” నాంది అని పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పుడు “భయముక్త” (భయం లేని) స్థితికి చేరుకుందని, అభివృద్ధి పట్ల పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు. 
 
“ఈ రోజు నుండి, బెంగాల్ భవిష్యత్తులో ఒక కొత్త అధ్యాయం లిఖించబడింది. నేటి నుండి, బెంగాల్ భయం నుండి విముక్తి పొంది, అభివృద్ధి పట్ల అచంచల విశ్వాసంతో నిండిపోయింది. నా బెంగాల్‌లో మార్పు వచ్చింది. ఈ విజయంతో, ‘వందేమాతరం’ ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తయిన ఈ శుభ సందర్భంలో, ప్రజలు ‘భారతమాత’కు, ఋషి బంకిం చంద్రులకు తమ ఘన నివాళులర్పించారు,” అని ఆయన తెలిపారు. 
 
సయోధ్య ధోరణిని ప్రదర్శిస్తూ, ఇకపై దృష్టి అంతా పురోగతి,  ఐక్యతపైనే ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. “బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినప్పుడు, చర్చ అంతా ‘బద్లావ్’ (మార్పు) గురించి ఉండాలే తప్ప, ‘బద్లా’ (ప్రతీకారం) గురించి కాదు; ‘భవిష్య’ (భవిష్యత్తు) గురించి ఉండాలే తప్ప, ‘భయ’ (భయం) గురించి కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేసిన ప్రధాని మోదీ, గత కొన్నేళ్లుగా పార్టీ శ్రేణులు ఎదుర్కొన్న కష్టాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
 
బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో మహిళలతో సహా అనేకమంది కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులను, హింసాకాండను ఎదుర్కొన్నారని చెబుతూ వారి పట్టుదల వల్లే పార్టీ ఈ విజయాన్ని సాధించిందని ఆయన కొనియాడారు. “ఈ విజయం ప్రతి ఒక్క కార్యకర్తకు, వారి కుటుంబాలకు చెందుతుంది,” అని ఆయన తెలిపారు. ఈ ఫలితాన్ని ‘నూతన ఉదయం’గా అభివర్ణిస్తూ, బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో ఈ క్షణం కోసం తరతరాలుగా ప్రజలు ఎదురుచూశారని ప్రధాని మోదీ చెప్పారు. 
 
“ఇది కేవలం సీట్ల సంఖ్య మాత్రమే కాదు—భయం, బుజ్జగింపు, హింస అనే రాజకీయాలను ఓడించిన ప్రజల విశ్వాసానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం,” అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ‘పగలు రాత్రి’ పనిచేస్తుందని కూడా ఆయన తెలిపారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్‌కు పచ్చజెండా ఊపడంతో పాటు, రాష్ట్రంలో కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 
అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. “మే 4వ తేదీ సాయంత్రం గడిచిపోతున్నప్పటికీ, బెంగాల్‌లో కొత్త సూర్యోదయం అయింది,” అని ఆయన చెప్పారు. అభివృద్ధి, విశ్వాసం, నూతన ఆశలతో సాగే కొత్త ప్రయాణానికి ఈ విజయం నాంది అని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఫలితాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ, బీజేపీ పాలన నమూనాపైనా, దాని అభివృద్ధి అజెండాపైనా ప్రజలలో పెరుగుతున్న విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
 
ప్రస్తుతం 20కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో, దేశవ్యాప్తంగా పార్టీ ఉనికి గణనీయంగా విస్తరించిందని ఆయన తెలిపారు. “‘నాగరిక్ దేవో భవ’ అనేది మనం మంత్రం. మనం పౌరులకే సర్వోన్నత ప్రాధాన్యత ఇస్తాము. ప్రజలు మమ్మల్ని రోజురోజుకు మరింతగా విశ్వసిస్తున్నారు,” అని ఓటర్లు పార్టీపై ఉంచిన విశ్వాసమే ఈ విజయానికి కారణమని ఆయన చెప్పారు. 
 
ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టడంలో ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారి పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. 
 
“ఈ రోజు నేను ఎన్నికల సంఘానికి, ఎన్నికల సంఘం ఉద్యోగులైన సోదర సోదరీమణులందరికీ, ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్న సిబ్బంది అందరికీ, ముఖ్యంగా భద్రతా దళాలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భారత ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టడంలో మీ అందరి కృషిని చరిత్ర ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది,” అని ఆయన అభినందించారు.