30 ఏళ్ళ తర్వాత చైనాకు భారత్ బియ్యం 

30 ఏళ్ళ విరామం తర్వాత భారత్‌ నుండి బియ్యం దిగుమతి చేసుకోవడాన్ని చైనా ఆరంభించింది. గతంలో సరఫరాను కఠినతరం చేయడంతో బియ్యం దిగుమతిలో చైనా వెనక్కు తగ్గింది. ఇప్పుడు భారత్‌ తగ్గింపు ధరలతో ఆఫర్‌ చేయడంతో దిగుమతికి చైనా ముందుకొచ్చినట్లు భారత పరిశ్రమ అధికారులు తెలిపారు. 
 
ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం భారత్‌ కాగా,  దిగుమతి చేసుకునే దేశం చైనా. గతంలో ఏడాదికి 4 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునే చైనా నాణ్యతను సాకుగా చూపుతూ  కొనుగోలుకు దూరంగా ఉండిపోయింది. 
 
సరిహద్దుల్లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాజకీయ ఉద్రికత్తల ఉన్నప్పటికీ ఈ పురోగతి సాధించడం గమనార్హం. తొలిసారిగా బియ్యాన్ని చైనా కొనుగోలు చేసిందని, ఈ పంట నాణ్యతను చూసిన తర్వాత వచ్చే ఏడాది మరింత కొనుగోలు చేసే అవకాశాలున్నాయని బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి. కృష్ణారావు తెలిపారు. 
 
డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో టన్నుకు రూ.22 వేల చొప్పున లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని పరిశ్రమ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చైనా థాయిలాండ్‌, వియత్నాం, మయాన్మార్‌, పాకిస్తాన్‌ల నుండి బియ్యం కొనుగోలు చేస్తూ వస్తోంది.