కేరళలో బాణాసంచా తయారీలో పేలుడు.. 13 మంది మృతి

కేరళలో బాణాసంచా తయారీలో పేలుడు.. 13 మంది మృతి
కేరళలోని సెంట్రల్‌ త్రిస్సూర్‌ జిల్లా ముండతికోడ్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మృతిచెందగా, గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఘటన సమయంలో 40 మంది అక్కడ ఉన్నారని అధికారులు భావిస్తున్నారు.  త్రిస్సూర్‌ పూరం పర్వదినం కోసం ఒక ఆలయానికి అవసరమైన బాణసంచాను తాత్కాలిక షెడ్‌లో తయారు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

పేలుళ్ల శబ్దం కిలోమీటర్ల మేర వినిపించిందని, ఈ ప్రమాదంలో చుట్టు పక్కల ఇండ్లు దెబ్బ తిన్నాయని స్థానికులు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉం డటం ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న వ్యవసాయ పొలాల్లో ఇటీవల తాత్కాలిక బాణసంచా తయారీ యూనిట్లను నెలకొల్పుతున్నట్టు అధికారులు గుర్తించారు.  రాష్ట్ర  ప్రభుత్వం యంత్రాంగాన్ని సహాయచర్యల నిమిత్తం పంపించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.

త్రిస్సూర్‌లో బాణసంచా పేలుడు కారణంగా తలెత్తిన అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుండి తక్షణమే రూ. 50 లక్షలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.  ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. “కేరళలోని త్రిస్సూర్‌లో పటాకుల కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.  మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ముండతికోడ్‌కు చెందిన సతీసన్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఈ కేంద్రంలో, తిరువంబడి దేవస్థానం నిర్వహించే నమూనా ప్రదర్శన, ప్రధాన త్రిస్సూర్‌ పూరం బాణాసంచా ప్రదర్శన రెండింటికీ అవసరమైన బాణాసంచా సామాగ్రిని ఐదు టెంట్లలో నిల్వ చేశారు. పూరం కోసం సన్నాహాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ పేలుడుకు తీవ్రంగా గాయపడిన వారిని త్రిస్సూర్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చేర్చారు. 

 
సమీపంలోని అన్ని ఆసుపత్రులను పూర్తి అప్రమత్తంగా ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ఆదేశించారు.  “త్రిస్సూర్‌లోని బాణసంచా నిల్వ కేంద్రంలో జరిగిన పేలుడు తీవ్ర కలవరపరిచింది. కాలిన గాయాలు, ఇతర గాయాలకు గురైన వారికి నిపుణుల వైద్య చికిత్స అందిస్తున్నాము. త్రిస్సూర్ మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్, ఇతర సమీప ఆసుపత్రులలో చికిత్స కోసం ఏర్పాట్లు చేశాము” అని ఆమె తెలిపారు.