కోర్టు వద్ద టిసిఎస్ నాసిక్ ఆపరేషన్స్ మేనేజర్ అశ్విని చైనాని
* నాసిక్ టీసీఎస్ ఉద్యోగిణిలకు ఇంటి నుండే పని
నాసిక్లోని తమ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులకు సంబంధించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించడంలో విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)పై విమర్శలు పెరుగుతున్నాయి. ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యంగా పరిశ్రమ నిపుణులు అభివర్ణిస్తున్నారు. వాస్తవాలను నిర్ధారించి, బాధ్యులను గుర్తించేందుకు ‘సమగ్ర విచారణ జరుగుతోందని’ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సోమవారం తెలిపారు. ఈ అంతర్గత విచారణకు నాయకత్వం వహించేందుకు కంపెనీ తన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తి సుబ్రమణియన్ను నియమించింది.
పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి తన సహోద్యోగి ఒకరు శారీరక సంబంధానికి బలవంతం చేశారని ఒక మహిళా ఉద్యోగి ఆరోపించడంతో ఈ కేసు మార్చిలో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. నాసిక్లోని టీసీఎస్ బీపీవో యూనిట్లో తమను కొందరు ముస్లిం యువకులు, ఒక యువతి కలిసి మతం మారాలని ఒత్తిడి తేవడంతోపాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఎనిమిది మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఆరోపణలు నిజమే అని గుర్తించి ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఏడుగురు పురుషులు, ఒక మహిళా అధికారి ఉన్నారు. మరో మహిళా ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తదనంతర దర్యాప్తులో వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాలకు సంబంధించి అనేక అదనపు ఫిర్యాదులు నమోదయ్యాయి.
అప్పటి నుంచి చట్ట అమలు సంస్థలు ఈ దర్యాప్తును విస్తరించాయి. సాక్ష్యాధారాలు సేకరించేందుకు నాసిక్ పోలీసులు, మహిళా అధికారులతో సహా రహస్య సిబ్బందిని కొన్ని వారాల పాటు ఆ ప్రాంగణంలో మోహరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ దర్యాప్తును అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్వహిస్తోంది.
ప్రధాన సూత్రధారి హెచ్ఆర్ మేనేజరే
ఈ నేపథ్యంలో నాసిక్లోని టీసీఎస్ క్యాంపస్లో గందరగోళ పరిస్థితి ఎదురైంది. అందుకే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తూ టీసీఎస్ ఆదేశాలు జారీ చేసింది. అక్కడి 150 మంది ఉద్యోగులకు ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి వర్క్ ఫ్రం హోం వర్తిస్తుంది. నాసిక్ కేసుకు సంబంధించి ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి అక్కడి హెచ్ఆర్ మేనేజరే అని తేలింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాధితులకు మద్దతుగా నిలవాల్సిన మహిళా ఆపరేషన్స్ హెడ్, హెచ్ఆర్ మేనేజర్లు నిందితులకు మద్దతుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, “ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి” అంటూ ఆమెను నిరుత్సాహపరిచినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ తెలిపారు.
పైగా, నిందితులకే హెచ్ఆర్ హెడ్ మద్దతుగా మాట్లాడింది. బాధితుల ఫిర్యాదుల్ని తొక్కిపెట్టడం, అవి పై అధికారుల వరకు వెళ్లకుండా చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటనల్లో ఆమే మాస్టర్ మైండ్ అని పోలీసులు అంటున్నారు.ఈ కేసుకు సంబంధించి 78 అనుమానిత కాల్ రికార్డ్స్, మెయిల్స్, చాట్స్ను పోలీసులు కనుగొన్నారు. కేవలం మహిళలే కాకుండా ఒక పురుష ఉద్యోగి కూడా తనను మత మార్పిడికి ప్రేరేపించారని ఫిర్యాదు చేశాడు. పని ప్రదేశంలో మానసిక వేధింపులు కూడా ఎదుర్కొన్నట్లు అతను పేర్కొన్నాడు.
సుప్రీంకోర్టులో పిటీషన్.. ఎన్సీడీబ్ల్యు దర్యాప్తు
టీసీఎస్ నాసిక్ ఉదంతం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్లో, “నాసిక్లో వ్యవస్థీకృతంగా జరుగుతున్న మత మార్పిడులు దేశవ్యాప్తంగా పౌరుల మనస్సాక్షిని కదిలించాయి” అని పేర్కొన్నారు.
మోసపూరిత మత మార్పిడులు సార్వభౌమాధికారం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు తీవ్రమైన ముప్పు మాత్రమే కాకుండా, సౌభ్రాతృత్వం, గౌరవం, ఐక్యత, జాతీయ సమైక్యతకు కూడా ప్రమాదకరమని ఆయన వాదించారు. మత మార్పిడులను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
మరోవంక, టిసిఎస్ బీపీఓ యూనిట్లో ఉద్యోగులపై జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఒక వాస్తవ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. ఈ కమిటీలో బాంబే హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ సాధనా జాదవ్, హర్యానా మాజీ డీజీపీ బీకే సిన్హా, సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా, ఎన్సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ లీలాబతి ఉన్నారు.
సంస్థాగత సంస్కృతి.. ఉన్నత యాజమాన్యం నిర్లిప్తత
మనీకంట్రోల్ నివేదిక ఉటంకించిన పరిశ్రమ వర్గాలు, సంస్థాగత సంస్కృతి, జవాబుదారీతనంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ టి.వి. మోహన్దాస్ పాయ్ ఈ పరిస్థితిని “వ్యవస్థలు, ప్రక్రియల వైఫల్యానికి” సూచికగా అభివర్ణించారు. భయాందోళన వాతావరణం ఉద్యోగులను తమ అభిప్రాయాలను బయటపెట్టకుండా నిరుత్సాహపరిచి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
తక్షణ పర్యవేక్షకులను దాటవేసి, ఉద్యోగులు నేరుగా ఉన్నత యాజమాన్యంతో తమ ఆందోళనలను తెలియజేయడానికి వీలు కల్పించే క్రమబద్ధమైన “స్కిప్-లెవల్” సమావేశాలతో సహా, కంపెనీలు అంతర్గత సమాచార మార్గాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో నిర్మాణాత్మక సమస్యలు ఉన్నాయని మరికొందరు ఎత్తి చూపారు.
చాలా కంపెనీలలో బహుళ-స్థాయి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు, కార్యాలయ దుష్ప్రవర్తనను పరిష్కరించడానికి తప్పనిసరి శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయని సిఐఇఎల్ హెచ్ఆర్ సీఈఓ ఆదిత్య మిశ్రా పేర్కొన్నారు. అయితే, ఉద్యోగులకు ఈ ప్రక్రియల గురించి తెలియకపోవడం లేదా పర్యవసానాలకు భయపడటం జరుగుతోందని ఆయన సూచించారు.
జవాబుదారిగా హెచ్ఆర్ అధిపతులతో సహా సీనియర్ నాయకత్వం
వివిధ ప్రాంతాలలో కార్పొరేట్ పాలన ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయా? అనే దానిపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. కంపెనీలు ప్రధాన మహానగర కేంద్రాలను దాటి విస్తరిస్తున్నందున, చిన్న నగరాల్లో ఉద్యోగుల సంక్షేమ విధానాలను అమలు చేయడంలో ఉన్న సంభావ్య లోపాలను ఈ కేసు ఎత్తి చూపుతోందని ఈఐఐఆర్ట్రెండ్ సీఈఓ పరేఖ్ జైన్ చెప్పారు. ముఖ్యంగా అధికార స్థానాల్లో ఉన్న వ్యక్తులపై దుష్ప్రవర్తన ఆరోపణలు ఉన్నప్పుడు, ఫిర్యాదులు నిర్ణయాధికారుల వద్దకు చేరకపోతే, హెచ్ఆర్ అధిపతులతో సహా సీనియర్ నాయకత్వం జవాబుదారీగా ఉండాలని ఆయన చెప్పారు.
నితేష్ రాణేతో సహా బీజేపీకి చెందిన కొందరు నాయకులు, కార్పొరేట్ రంగాలలో లక్షిత దోపిడీకి సంబంధించిన లోతైన పద్ధతి ఉందని ఆరోపిస్తూ, ఈ సంఘటనను “కార్పొరేట్ జిహాద్” వంటి పదాలతో పేర్కొన్నారు. హిందూ బాధితులను నమాజ్ చేయమని, బీఫ్ తినమని బలవంతం చేశారని, వారి మతాన్ని అవమానించారని మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఆరోపించారు.
అంతేకాకుండా, నిందితులు బాధితులను మతం మార్చడానికి ప్రయత్నించారని కూడా ఆయన తెలిపారు. అమ్మాయిలను ఆకర్షించి, ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసే ఒక ముఠా బారిన ఈ మహిళలు పడి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 5,80,000 మందికి పైగా ఉద్యోగులతో భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థలలో ఒకటైన టీసీఎస్, దుష్ప్రవర్తనపై జీరో-టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ కేసు కార్యాలయ భద్రత, జవాబుదారీతనం, పెద్ద సంస్థలలో కార్పొరేట్ పాలనా చట్రాల సమర్థతపై విస్తృత చర్చకు దారితీసింది.
More Stories
నాలుగేళ్ళలో తొలిసారిగా డీజిల్ ధర పెంపు తప్పదా?
అమెరికా, ఇరాన్ రెండో దశ చర్చలపై అనిశ్చితి
భారత- శ్రీలంక ఒప్పంద స్ఫూర్తిని గుర్తు చేసిన శ్రీలంక తమిళ పార్టీలు