కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

అంగన్​వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ఆరోపణలు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​కు తెలంగాణ మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్​ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. అంగన్​వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని సీతక్కతెలిపారు.

టెండర్ వాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ రూ.44 కోట్లు ఉంటే అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్ చేశారు.

48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో సీతక్క వెల్లడించారు. అంగన్‌వాడీ టీచర్లకు గతంలో సెల్‌ఫోన్లు అందించగా వాటికి 5జీ స్థాయి నెట్‌వర్క్‌ సామర్థ్యం లేదు. దీంతో సిగ్నల్‌ సరిగా ఉండని ప్రాంతాల్లో టీచర్లు వాటిని ఉపయోగించటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

పైగా, గతంలో అందించిన స్మార్ట్​ఫోన్లకు అనేక సమస్యలు ఉత్పన్నం అవటంతో ప్రభుత్వం అధునాతన ఫీచర్లు ఉన్న నూతన సెల్‌ఫోన్లను అందించింది. అంగన్‌వాడీ టీచర్లకు నూతన సెల్‌ఫోన్లు అందించే ప్రక్రియ మొదలైంది. సెల్‌ఫోన్ల ద్వారానే అంగన్​వాడీ టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉండటంతో వాటి అవసరం ఎంతో ఉంది.