డీజిల్, విమాన ఇంధనం ఏటీఎఫ్పై ఎగుమతి సుంకం పెంపు 

డీజిల్, విమాన ఇంధనం ఏటీఎఫ్పై ఎగుమతి సుంకం పెంపు 
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా దేశీయంగా ఇంధన కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై ఎగుమతి సుంకాలను పెంచుతూ కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.55.50కి పెంచారు. అదే విధంగా ఏవియేషన్ (టర్బైన్ ఫ్యూయల్‌ ఏటీఎఫ్​) పై సుంకాన్ని లీటరుకు రూ.42గా నిర్ణయించారు. ఇంతకుముందు ఈ రేట్లు తక్కువగా ఉండగా, ఇప్పుడు భారీగా పెంచడం ద్వారా ఎగుమతులపై నియంత్రణ తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.  పశ్చిమాసియా యుద్ధం కారణంగా మార్చి 26న కేంద్రం డీజిల్‌పై లీటరుకు రూ.21.50, ఏటీఎఫ్‌పై రూ.29.50 చొప్పున ఎగుమతి సుంకం విధించింది.

అయితే పశ్చిమాసియా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల కొత్తగా సుంకాలను పెంచాల్సిన అవసరం ఏర్పడింది.  ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయంగా కూడా ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎగుమతిదారులు అంతర్జాతీయ ధరల వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని అధిక లాభాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం గుర్తించింది.

అందుకే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచి, దేశీయ మార్కెట్లో సరఫరా నిలకడగా ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ నిర్ణయం ప్రధానంగా దేశీయంగా డీజిల్, ఏటీఎఫ్ సరఫరా తగ్గకుండా చూసుకోవడం. రెండోది గ్లోబల్ మార్కెట్ ధరల వ్యత్యాసాన్ని ఉపయోగించి ఎగుమతి దారులు అక్రమ ప్రయోజనాలు పొందుకుండా నిరోధించడం లక్ష్యంగా తీసుకున్నారు. ఇక పెట్రోల్‌పై ఎగుమతి సుంకం మాత్రం యథాతథంగా సున్నాగా కొనసాగుతోంది.