తెలంగాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వాయిదా !

తెలంగాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వాయిదా !
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో ప్రారంభం కానున్న జనాభా లెక్కల సేకరణ  కార్యక్రమాల దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.  ప్రతి 25 ఏళ్లకు ఒకసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రక్రియను ఇప్పుడు జూన్ నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
చివరగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ సవరణ చేపట్టగా, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణలో ఈ భారీ కసరత్తు జరగనుంది.  కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఈ సవరణను చేపట్టింది. తొలి విడతలో బీహార్, రెండో దశలో బెంగాల్, తమిళనాడు వంటి 11 రాష్ట్రాల్లో ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మూడో విడతలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుండగా, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. 

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మ్యాపింగ్ ముగిసింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓలు) ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. ఇప్పటికే ప్రాథమిక సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా రెండు చోట్ల ఓట్లు ఉన్న సుమారు 2 లక్షల మందిని గుర్తించి తొలగించగా, మరో 2.5 లక్షల ఓట్లపై విచారణ జరుగుతోంది. ఓటర్ల జాబితాలో మార్పులు లేదా కొత్త నమోదు కోసం ఈసీ 11 రకాల గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది.

అయితే, పుట్టిన సంవత్సరం ఆధారంగా నిబంధనల్లో మార్పులు ఉన్నాయి. 1987 కంటే ముందు జన్మించిన వారు తల్లిదండ్రుల వివరాలను సమర్పించాల్సి ఉండగా, 1987-2004 మధ్య జన్మించిన వారికి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి.  పాస్‌పోర్ట్, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంక్ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు,  భూమి కేటాయింపు పత్రాలను కూడా ఆధారాలుగా అంగీకరిస్తారు. ఈ సమగ్ర సవరణ ద్వారా మరణించిన వారి పేర్లు, నకిలీ ఓట్లు, వలస వెళ్ళిన వారి వివరాలను తొలగించి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే ఈసీ ప్రధాన లక్ష్యం.