యుద్ధం ఆపాలని ట్రంప్ ను కోరిన మోదీ!

యుద్ధం ఆపాలని ట్రంప్ ను కోరిన మోదీ!
 
* అఖిలపక్ష సమావేశంలో భారత్ వెల్లడి 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై చర్చించిన ఒక రోజు తర్వాత, ఆ యుద్ధం “ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోంది” కాబట్టి అది ముగిసిపోవాలని భారతదేశం కోరుకుంటోందని మోదీ ట్రంప్‌కు స్పష్టం చేసినట్లు ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశంలో తెలియజేసింది.  
అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించడం భారతదేశానికి ఎదురుదెబ్బేనా అని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించగా, 1981 నుంచి పాకిస్తాన్ ఆ పాత్రనే పోషిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇతర దేశాల వెంటపడి, తమ సేవలు అవసరమా?  అని అడిగే “దళారి” దేశంగా భారతదేశం ఉండజాలదని ఆయన అన్నట్లు కనీసం ఇద్దరు నాయకులు పేర్కొన్నారు. 
 
 అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ దళారీ దేశంగా వ్యవహరించదని చెప్పారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో వారానికి చేరుకోవడంతో మధ్యవర్తిత్వం వహించడానికి పాక్ ఉత్సాహం కనబరుస్తోంది. చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఎందుకు మౌనంగా ఉందని విపక్షాలు ప్రశ్నించినప్పుడు, భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉందని, ఎన్నడూ దళారీ దేశంగా వ్యవహరించదని జైశంకర్ వ్యాఖ్యానించారు.
 
సమావేశంలో హాజరైన కొందరి ప్రకారం, దీనిని భారతదేశ విదేశాంగ విధాన వైఫల్యంగా చూస్తుంటే, గతంలో కూడా వైఫల్యాలు ఉన్నాయని జైశంకర్ ఎత్తి చూపారు. కాగా,  భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది. 

ఒక గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధర్మేంద్ర యాదవ్, జావెద్ అలీ, సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్, ఎల్‌జేపీ నేత అరుణ్ భారతి, డీఎంకే నేత పి.విల్సన్, ఆప్ ఎం సంజయ్ సింగ్, జేడీయూ నేత రాజీవ్ సింగ్, సంజయ్ ఝా తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ నుంచి ఎవరూ హాజరుకాలేదు.

అఖిలపక్ష సమావేశానంతరం కిరణ్ రిజిజు మాట్లాడుతూ, సమావేశంలో అన్ని పార్టీలు చురుకుగా పాల్గొన్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం, భారత్‌‌పై దాని ప్రభావంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. ప్రభుత్వం సమగ్రంగా, సంపూర్ణంగా స్పందించిందని, విపక్షాలందరి ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చిందని చెప్పారు. 

ప్రస్తుత పరిస్థితిని సమర్ధవంతగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతామని విపక్ష పార్టీలు హామీనిచ్చాయని చెప్పారు. ‘ప్రస్తుత సంక్షోభ సమయంలో పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సమష్టిగా మద్దతు ఇస్తామని విపక్షాలు తెలిపాయి’ అని రిజిజు వివరించారు.

నాలుగైదు రోజుల్లో భారత్‌కు రానున్న 4 నౌకలు

కాగా, దేశంలో ఇంధన భద్రత స్థిరంగా, దేశ ఇంధన అవసరాలకు సరిపడా ఉందని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సరకు కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడంతో పాటు వివిధ దేశాలతో సంప్రదింపులు సాగిస్తున్నామని, నిరంతరాయ ఇంధన సరఫరాకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొన్నాయి. 

ఎల్‌జీపీ లభ్యత, హోర్ముజ్ జలసంధి మీదుగా షిప్‌మెంట్‌పై సమావేశంలో విపక్షాల ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, మరో నాలుగైదు రోజుల్లో నాలుగు నౌకలు పోర్టుకు చేరుకుంటాయని ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ఇంధన కొరత లేదని, తగినన్ని నిల్వలు ఉన్నాయని వివరించింది.  అఖిలపక్షానికి హాజరైన అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, విపక్షాలతో ఏ సమయంలోనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. దేశ ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విపక్షాలతో చర్చలకు తలుపులు తెరిచే ఉంటాయని రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారు. 

యుద్ధంతో తలెత్తిన పరిణామాలు, ఇంధన భద్రతపై ఆందోళనలు, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను విదేశాంగ కార్యదర్శి మిస్రీ అఖిల పక్ష నేతలకు వివరించారు. మొత్తం మీద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, దేశీయంగా ప్రజల ఆందోళనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని అఖిలపక్ష సమావేశం ఇచ్చింది.

ఇలా ఉండగా, దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తోంది. తాజాగా రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్టు ‘బ్లూమ్‌బర్గ్’ తన కథనంలో పేర్కొంది.  ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లోని బ్రెంట్ క్రూడాయిల్ ధర కంటే, బ్యారెల్‌‌కు 5-15 డాలర్లు అధికంగా చెల్లించి మరీ భారత రిఫైనరీలు ఈ కొనుగోళ్లు జరిపినట్టు సమాచారం.

ఫిబ్రవరిలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుతో పోల్చుకుంటే ఈ కొనుగోళ్లు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.  హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసి ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో.. రష్యా క్రూడాయిల్‌పై అమెరికా ఆంక్షలు సడలించింది. దీంతోనే భారత్ రిఫైనరీలు ఇంత భారీ స్థాయిలో కొనుగోళ్లు జరిపాయి.  హోర్ముజ్ జలసంధి దగ్గర నౌకల ప్రయాణానికి అంతరాయం కొనసాగినంత కాలం రష్యా ముడి చమురుపై ఆంక్షల సడలింపును అమెరికా పొడిగించే అవకాశం కనిపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురుపై కూడా ఆమెరికా ఆంక్షలు ఎత్తేసింది. ఆ చమురును కూడా భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.