రా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ఆంక్షలు… అమెరికా నివేదికపై భారత్ కన్నెర్ర 

రా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ఆంక్షలు… అమెరికా నివేదికపై భారత్ కన్నెర్ర 
మత స్వేచ్ఛ ఉల్లంఘనలలో పాత్ర పోషిస్తున్నందుకు భారతదేశ విదేశీ నిఘా వ్యవస్థ రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా), ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వ కమిషన్ (యూఎస్‌సీఆర్‌ఎఫ్‌) తన 2026 సంవత్సరం వార్షిక నివేదికలో సిఫార్సు చేసింది.
 
భారతదేశంలో మతస్వేచ్ఛకు జరుగుతున్న ఉల్లంఘనలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ కమిషన్‌ నివేదిక ఇవ్వడం వరుసగా ఇది ఏడవసారి. అయితే భారత్‌ను మతస్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్న దేశంగా ప్రకటించాలన్న కమిషన్‌ సిఫార్సును అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఏ సంవత్సరమూ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నివేదికపై భారత్ ఆగ్రవేశాలు వ్యక్తం చేసింది. 

ఆర్‌ఎస్‌ఎస్‌, ‘రా’పై ఆంక్షలు విధించాలని సిఫార్సు చేస్తూ అమెరికా కమిషన్‌ ఇచ్చిన తాజా వార్షిక నివేదికను విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం తోసిపుచ్చింది. నిష్పాక్షిక వాస్తవాల కంటే భారత్‌పై అవాస్తవ వక్రీకరణలతో కూడిన కథనాన్ని కమిషన్‌ తన నివేదికలో చిత్రీకరించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్‌ జైస్వాల్‌ సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. నివేదికను నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నామని ఆయన తెలిపారు.

రణధీర్ జైస్వాల్ తన ప్రకటనలో, నిష్పక్షపాత వాస్తవాలకు బదులుగా సందేహాస్పదమైన ఆధారాలు, సైద్ధాంతిక కథనాలపై ఆధారపడి, కమిషన్ భారతదేశపు వక్రీకరించిన, పక్షపాత చిత్రాన్ని ప్రదర్శించడంలో పట్టుదలతో ఉందని మండిపడ్డారు. “యూఎస్‌సీఆర్‌ఎఫ్‌  తాజా నివేదికను మేము గమనించాము. భారతదేశంపై దాని ఉద్దేశపూర్వక, పక్షపాత చిత్రణను మేము ఖచ్చితంగా తిరస్కరిస్తున్నాము”  చెప్పారు. 

గత కొన్నేళ్లుగా,  యూఎస్‌సీఆర్‌ఎఫ్‌ నిష్పక్షపాత వాస్తవాలకు బదులుగా సందేహాస్పదమైన ఆధారాలు, సైద్ధాంతిక కథనాలపై ఆధారపడి, భారతదేశపు వక్రీకరించిన, పక్షపాత చిత్రాన్ని ప్రదర్శించడంలో పట్టుదలతో ఉందని విమర్శించారు. ఇటువంటి పునరావృత తప్పుడు ప్రాతినిధ్యాలు కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని జైస్వాల్ హెచ్చరించారు.

 “భారతదేశంపై పక్షపాత విమర్శలతో కొనసాగడానికి బదులుగా, అమెరికాలోని హిందూ దేవాలయాలపై విధ్వంసం, దాడుల వంటి కలవరపరిచే సంఘటనలు, భారతదేశాన్ని పక్షపాతంగా లక్ష్యంగా చేసుకోవడం,  అమెరికాలోని భారతీయ ప్రవాసులపై పెరుగుతున్న అసహనం, బెదిరింపులపై  యూఎస్‌సీఆర్‌ఎఫ్‌  పునరాలోచించుకుంటే మంచిది” అని ఆయన హితవు చెప్పారు. 

భారతదేశాన్ని “ప్రత్యేక ఆందోళన కలిగించే దేశం”గా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ పేర్కొని, ఆయుధాల అమ్మకాలు, వాణిజ్య విధానాలను మత స్వేచ్ఛతో ముడిపెట్టాలని అమెరికాను కోరిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ‘సిస్టమాటిక్ రెలిజియస్ పెర్సిక్యూషన్ ఇన్ ఇండియా’ అనే తమ నివేదిక, మత లేదా విశ్వాస స్వేచ్ఛకు సంబంధించిన సమస్యల విషయంలో భారతదేశ సామాజిక, రాజకీయ,  క్రిమినల్ న్యాయ వ్యవస్థల స్థూల చిత్రాన్ని అందిస్తుందని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ తెలిపింది.

“ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వంటి హిందూ జాతీయవాద బృందాలకు, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మధ్య ఉన్న సంబంధాన్ని,  ఈ గతిశీలత మత స్వేచ్ఛపై చూపే ప్రభావాలను కూడా పరిశీలిస్తుంది. మత స్వేచ్ఛకు కొన్ని రాజ్యాంగ రక్షణలు కల్పించినప్పటికీ, భారతదేశ రాజకీయ వ్యవస్థ మత మైనారిటీ వర్గాల పట్ల వివక్షాపూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తోంది,” అని ఆ నివేదిక ఆరోపించింది. 

భారతదేశంలో మత స్వేచ్ఛకు పరిస్థితులు “క్షీణిస్తూనే ఉన్నాయి” అని కూడా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ వాదించింది. భారత ప్రభుత్వం మత మైనారిటీలను, ప్రార్థనా మందిరాలను “లక్ష్యంగా చేసుకుంటోందని” ఆరోపించింది. 

“కఠినమైన జైలు శిక్షలను చేర్చడానికి మతమార్పిడి వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడానికి లేదా బలోపేతం చేయడానికి అనేక రాష్ట్రాలు ప్రయత్నాలు చేపట్టాయి. భారత అధికారులు పౌరులు, మత శరణార్థులను విరివిగా నిర్బంధించడానికి, చట్టవిరుద్ధంగా బహిష్కరించడానికి కూడా సహకరించారు. అలాగే మత మైనారిటీ వర్గాలపై సామూహిక దాడులను సహించారు,” అని నివేదిక పేర్కొంది. 

1998లో అమెరికా కాంగ్రెస్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన యూఎస్‌సీఆర్‌ఎఫ్‌ “విదేశాలలో మత లేదా విశ్వాస స్వేచ్ఛ  అనే సార్వత్రిక హక్కును పర్యవేక్షిస్తుంది”. అమెరికా అధ్యక్షుడు, అమెరికా విదేశాంగ శాఖ, అలాగే కాంగ్రెస్‌కు సిఫార్సులను చేస్తుంది. తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామని ఈ సంస్థ పేర్కొన్నప్పటికీ, దీనికి సంబంధించిన తొమ్మిది మంది కమిషనర్లను అమెరికా అధ్యక్షుడు, అలాగే ప్రతినిధుల సభ, సెనేట్‌లోని సీనియర్ రాజకీయ నాయకులు నియమిస్తారు.