పహల్గామ్‌ ఉగ్రదాడిలో ‘గో ప్రో హీరో 12 కెమెరా’లు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో ‘గో ప్రో హీరో 12 కెమెరా’లు
జమ్ముకశ్మీర్‌ లోని పహల్గామ్‌ లో గత ఏడాది జరిగిన ఉగ్రదాడికి సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులు ‘గో ప్రో హీరో 12 కెమెరా’ లను ఉపయోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. చైనాకు చెందిన ఏఈ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వద్ద ఈ ‘గో ప్రో’ కెమెరాలు ఉన్నట్లు తెలుసుకుంది.
 
దర్యాప్తులో గోప్రో హీరో 12 బ్లాక్ కెమెరాను “కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరం”గా గుర్తించారు. కోర్టు ఇలా నమోదు చేసింది, “అటువంటి కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరం గోప్రో హీరో 12 బ్లాక్ కెమెరా, ఇది సీరియల్ నంబర్ C3501325471706ను కలిగి ఉంది, ఇది పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాద మాడ్యూల్ యొక్క ముందస్తు దాడి నిఘా, కదలిక, కార్యాచరణ తయారీని స్థాపించడానికి సంబంధించినది.”

దాంతో ఉగ్రదాడికి వాడిన ‘గో ప్రో’ కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను తెలుసుకునేందుకు చైనా సాయం కోరాలని ఎన్‌ఐఏ భావిస్తోంది. అందుకు జమ్ముకశ్మీర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం నుంచి తాజాగా అనుమతులు లభించాయి. ఘటనా స్థలం నుంచి ‘గో ప్రో హీరో 12 మోడల్‌ బ్లాక్‌ కెమెరాల’ ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. 

ఈ కెమెరాల్లోని సమాచారం బయటికి తీయగలిగితే దాడికి ముందు ఉగ్రవాదుల కదలికలు, ప్రణాళికల గురించి తెలుసుకోవడంలో ఇవి కీలకంగా మారనున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ 18న పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దానికి ఏడాది ముందు చైనాకు చెందిన ఏఈ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వద్ద ఈ ‘గో ప్రో కెమెరాలు’ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 

2024 జనవరి 30న చైనాలోని డోంగ్వాన్‌లో ఈ కెమెరాలు యాక్టివేట్‌ అయినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కెమెరా తయారీదారు ‘గో ప్రోబీవీ’ కి నోటీసులు జారీచేశారు. అయితే వాటి లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తయారీదారులు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వీటిని ఎవరు కొనుగోలు చేశారు? చివరిగా ఎవరు వినియోగించారు? అనే వివరాలు తెలుసుకోవడానికి చైనా సాయం కోరేందుకు ఎన్‌ఐఏ సిద్ధమైంది. దీనికి సంబంధించి చైనా న్యాయశాఖ అధికారికి లేఖ రాయనుంది. అందుకు భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి.