ఓ భారత పారిశ్రామికవేత్తను బలవంతంగా గెంటేస్తోన్న స్వీడన్ 

ఓ భారత పారిశ్రామికవేత్తను బలవంతంగా గెంటేస్తోన్న స్వీడన్ 
స్వీడన్‌లో ‘హైడ్రో స్పేస్ స్వీడన్ ఏబీ’ అనే విజయవంతమైన అగ్రి-టెక్ కంపెనీని స్థాపించిన భారతీయ పారిశ్రామికవేత్త అభిజిత్ నాగ్ బాలసుబ్రమణ్యకు ఆదేశం బలవంతంగా భారత్‌కు పంపించేసింది. దీంతో ఆయన కంపెనీ అమ్మేసి మరీ స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఈక్రమంలోనే అక్కడి వలస విధానాలపై విరుచుకుపడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
 
అభిజిత్ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులో  ముఖ్యంగా “నేను ఈ రోజు నా కంపెనీ సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నాను. నా కంపెనీని అమ్మేశాను. ఈ నెలాఖరుకల్లా నేను ఈ దేశం విడిచి వెళ్లాల్సిందే. ఇది నా ఇష్టపూర్వక నిష్క్రమణ కాదు. ఒక అసమర్థ, శత్రుపూరిత వ్యవస్థ నన్ను ఇక్కడి నుంచి గెంటేస్తోంది” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
స్వీడన్ తనను తాను స్టార్టప్ ఫ్రెండ్లీ దేశంగా ప్రచారం చేసుకుంటుందని, కానీ అది కేవలం ఒక ముసుగు మాత్రమేనని అభిజిత్ విమర్శించారు. అక్కడి వలస ఏజెన్సీ విదేశీయుల పట్ల వివక్ష చూపుతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన వీసా ఫైల్‌ను హ్యాండిల్ చేసిన అధికారులకు కనీస వ్యాపార అవగాహన లేదని మండిపడ్డారు. 
 
పదేపదే డాక్యుమెంటేషన్ విషయంలో అవి కావాలంటూ, ఇవి కావాలంటూ ఇబ్బంది పెట్టడం, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో తన మానసిక ఆరోగ్యం దెబ్బతిందని వివరించారు. అందుకే చట్టపరమైన పోరాటం చేయకుండా భారత్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
 
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్న తన వంటి నిపుణుడికే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం స్వీడన్ భవిష్యత్తుకే నష్టమని ఆయన హెచ్చరించారు. అభిజిత్ పోస్ట్‌పై స్పందించిన అనేక మంది విదేశీయులు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని వాఖ్యలు చేస్తున్నారు.
 
“మీ బాధను నేను అర్థం చేసుకోగలను. స్వీడన్ వ్యవస్థ మీ నివాసాన్ని నిరాకరించవచ్చు. కానీ మీలోని పారిశ్రామిక స్ఫూర్తిని చంపలేదు” అంటూ ఒక సహచర పారిశ్రామికవేత్త ధైర్యం చెప్పారు. ఒక దేశ ఆహార భద్రతకు తోడ్పడుతున్న వ్యక్తిని ఇలా అవమానించడం స్వీడన్ చేసుకున్న స్వయంకృతాపరాధమని మరికొందరు విమర్శిస్తున్నారు.