అమెరికా మ‌మ్ముల్ని టాయిలెట్ పేప‌ర్‌లా వాడి పడేసింది

అమెరికా మ‌మ్ముల్ని టాయిలెట్ పేప‌ర్‌లా వాడి పడేసింది

* అమెరికాతో స్నేహం వల్లే పాక్ పతనం?

అగ్రరాజ్యం అమెరికా దౌత్య నీతిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా తమ దేశాన్ని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకున్న వాషింగ్టన్ అవసరం తీరాక తమను ఓటాయిలెట్ పేపర్ ముక్కలా విసిరి పారేసిందని ఆరోపించారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన గడిచిన కాలంలో పాకిస్థాన్ పాలకులు చేసిన తప్పిదాలు, ఉగ్రవాద చరిత్రపై ఆత్మవిమర్శ చేసుకుంటూ ప్రసంగం చేశారు. 

 
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఈ వాఖ్యలు  అంతర్జాతీయవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.  1999లో అప్పటి పాక్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని సైన్యం ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చే అధికారాన్ని చేజిక్కించుకుందని ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇక 2001 తర్వాత అమెరికాతో పాకిస్థాన్ జతకట్టడం తమ దేశానికి తీరని నష్టం చేకూర్చిందని చెప్పారు. 
 
ముఖ్యంగా అమెరికా మద్దతుతో తాలిబన్లను వ్యతిరేకంగా తమ సర్కారు చర్యలు తీసుకుందని చెప్పారు. దీంతో అఫ్గాన్ కూడా తమపై హింసకు పాల్పడిందని, కానీ అప్పుడు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమను గాలికొదిలేసిందని వివరించారు. యూఎస్ తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మాత్రమే తమను వాడుకుందని స్పష్టం చేశారు. దాని పర్యవసానం వల్లే నేడు పాకిస్థాన్‌లో ఉగ్రవాదం విలయతాండవం చేస్తోందని అని ఆయన కుండబద్దలు కొట్టారు.

గతంలో పాకిస్థాన్‌ను పాలించిన సైనిక నియంతలు జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ చేసిన తప్పులను కూడా ఖవాజా ఆసిఫ్ ఎత్తిచూపారు. వారు అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నది ఇస్లాం కోసం కాదని, కేవలం ఒక సూపర్ పవర్ (అమెరికా)ను ప్రసన్నం చేసుకోవడానికేనని ఆయన స్పష్టం చేశారు. 
 
“మేము మా చరిత్రను నిరంతరం తిరస్కరిస్తూ ఉంటాము. కానీ నిజం ఏంటంటే ఈరోజు మేము ఎదుర్కొంటున్న ఉగ్రవాదం అనేది గడిచిన కాలంలో నియంతలు చేసిన తప్పుల పర్యవసానమే” అని ఆయన తేల్చి చెప్పారు.  యుద్ధాలను సమర్థించుకోవడానికి పాకిస్థాన్ విద్యా వ్యవస్థను కూడా మార్చేశారని, సిద్ధాంతపరమైన మార్పులతో భావితరాల మనసుల్లో విషం నింపారని ఆసిఫ్ విమర్శించారు. 
 
జిహాద్ అనే పదాన్ని తప్పుగా వాడుతూ యువతను తప్పుదోవ పట్టించారని, దీని వల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేమని ఆయన వాపోయారు. అమెరికా ఆ ప్రాంతం నుంచి వైదొలిగినా, పాకిస్థాన్ మాత్రం హింస, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం వంటి నష్టాలతో కొట్టుమిట్టాడుతోందని ఆయన వివరించారు. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలోనూ అగ్రరాజ్యం తమకు ఎలాంటి సహాయం చేయలేదని, కేవలం తమ అవసరాలకు మాత్రమే వాడుకుందని మండిపడ్డారు.