కాంగ్రెస్‌ ఎంపీ గొగోయ్‌ సతీమణికి పాకిస్థాన్‌తో సంబంధాలు

కాంగ్రెస్‌ ఎంపీ గొగోయ్‌ సతీమణికి పాకిస్థాన్‌తో సంబంధాలు

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ సతీమణి ఎలిజబెత్‌ గొగోయ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను విమర్శించే పాక్‌ జాతీయుడు అలీ తౌఖీర్‌ షేక్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఏజెంట్‌ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్‌కు వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నారు.

“పాకిస్థానీ ఏజెంట్‌ అలీతో గౌరవ్‌ గొగొయ్‌, ఆయన సతీమణి, బ్రిటన్‌ పౌరురాలైన ఎలిజబెత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2011లో అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లింది. అక్కడ పాక్‌ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఆ తర్వాత భారత్‌కు బదిలీ చేసింది. ఆమె జీతాన్ని అలీ చెల్లించాడు. ఎలిజబెత్ భారత్​లోని ఒక సంస్థలో పనిచేస్తూ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్​కు చేరవేశారు” అని ఆయన స్పష్టం చేశారు. 

ఆమె భారత్‌లోని రెండు సంస్థల్లో పనిచేస్తున్న సమయంలో తొమ్మిది సార్లు పాక్​కు వెళ్లిందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టాక అలీ తౌకీర్‌ షేక్‌ భారత్‌కు రావటం మానేసినట్లు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందాలతో కలిసి అలీ తౌఖీర్‌ షేక్‌, భారత పర్యటనకు వచ్చేవాడని చెప్పారు.

“ఈ పర్యటనలన్నీ డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. ఎలిజబెత్, గౌరవ్ భారతదేశ అధికార వ్యవస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వీసాలన్నీ కాంగ్రెస్ పాలనలోనే జారీ అయ్యాయి. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అతను భారతదేశ పర్యటనలు ఆపేశాడు. భారతదేశ పర్యటనల సమయంలో అతను ఉన్నత స్థాయి పాకిస్తానీ అధికారులను కూడా తనతో పాటు తీసుకువచ్చారు,” అని శర్మ వెల్లడించారు.

“నేను సింగపూర్​లో ఉన్నప్పుడు ఎంపీ గౌరవ్ గోగోయ్, కొంతమంది యువకులను పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి తీసుకెళ్తున్న ఫొటో వైరల్ అయింది. అప్పట్లో అబ్దుల్ బసిత్ భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్‌గా ఉన్నారు. ఒక విధంగా గోగోయ్ పాకిస్థాన్‌ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించారు. ఈ విధంగా మరే కాంగ్రెస్ నేత కూడా పాకిస్థాన్​కు ప్రతినిధి బృందంతో వెళ్లినట్టు నాకు తెలియదు” అని ధ్వజమెత్తారు. 

మొదట ఈ చిత్రాన్ని ఫొటోషాప్ అనుకున్నానాని, కానీ కాంగ్రెస్ నేతలు దాన్ని సమర్థించడంతో నిజమని అర్థమైందని చెబుతూ అందుకే పూర్తి దర్యాప్తును ప్రారంభించాం  అని, రాష్ట్ర మంత్రివర్గం ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపిందని ఆయన తెలిపారు.  ఇప్పుడు గొగాయ్ ని అరెస్ట్ చేస్తే ఎన్నికల ముందు రాజకీయం చేస్తున్నామని అంటరాని, అందుకనే అరెస్ట్ చేయడం లేదని ఆయన చెప్పారు.