నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై సచివాలయంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం సమావేశానికి మంత్రి లోకేష్ అధ్యక్షత వహిస్తూ చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మలేషియాలో మై డిజిటల్ ఐడీ, పాస్ పోర్టు వివరాలతో ఈ-కేవైసీ అనుసంధానం ద్వారా 16సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఉందని తెలిపారు. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలన్న విషయమై మంత్రుల బృంద సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఎంత వయోపరిమితి విధించాలనే విషయమై వివిధ దేశాల్లో చట్టాలను పరిశీలించాల్సిందిగా మంత్రుల బృందం అధికారులకు సూచించింది.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసే వారితో పాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్ ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీనిపై చర్చించేందుకు గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం కంప్లయన్స్ ఆఫీసర్లను కూడా వచ్చే జీవోఎం సమావేశానికి రప్పించాలని సూచించారు.
సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్-46 ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సహయోగ్ పోర్టల్ ద్వారా కొన్ని కేసుల విషయంలో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కంప్యూటర్ రిలేటెడ్ ఎఫెండర్స్, సైబర్ లా ఎఫెండర్స్ కట్టడి, సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఐ& పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఆకే రవికృష్ణ (ఐజీ, ఈగల్, ఇన్ చార్జ్, సైబర్ క్రైమ్) తదితరులు పాల్గొన్నారు.

More Stories
శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో బడా కుట్ర
బంగ్లా జైలు నుంచి విశాఖ మత్స్యకారుల విడుదల
రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల దుమారం