ఐఎఎన్‌ఎస్‌ వార్తా సంస్థ అదానీ గ్రూప్‌ స్వాధీనం

ఐఎఎన్‌ఎస్‌ వార్తా సంస్థ అదానీ గ్రూప్‌ స్వాధీనం
ప్రముఖ బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌ 24 శాతం వాటాను కొనుగోలు చేసి ఐఎఎన్‌ఎస్‌ (ఇండో-ఆసియన్‌ న్యూస్‌ సర్వీస్‌) ను పూర్తిగా తన స్వాధీనం చేసుకుంది. ఈ వార్తా సంస్థకు సంబంధించిన 24 శాతం వాటాను ఎంతమొత్తంలో కొనుగోలు చేసిందనే విషయాన్ని అదానీ గ్రూప్‌ వెల్లడించలేదు.  అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ మీడియా విభాగం అయిన ఎఎంజి మీడియా నెట్‌వర్క్‌ లిమిటెట్‌ ఐఎఎన్‌ఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తాజాగా అదానీ కంపెనీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ ఫైలింగ్‌ తెలిపింది.
 
కాగా, డిసెంబర్‌ 2023లో అదానీ గ్రూప్‌ ఐఎఎన్‌ఎస్‌ వార్తా సంస్థలో 50 :50 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఈ న్యూస్‌వైర్‌ ఏజెన్సీని అదానీ మీడియా విభాగానికి అనుబంధ సంస్థగా మారింది. జనవరి 2024లో ఎఎంజి మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ (ఎఎంఎన్‌ఎల్‌) తన ఓటింగ్‌ హక్కులతో ఐఎఎన్‌ఎస్‌ షేర్ల యాజమాన్యాన్ని 76 శాతానికి పెంచుకుంది.
 
ఐఎఎన్‌ఎస్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేయడానికి ఎఎంఎన్‌ఎన్‌ఎల్‌ జనవరి 21, 2026న షేర్‌ కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేసింది. దీంతో ఐఎఎన్‌ఎస్‌ కంపెనీ పూర్తిగా కంపెనీ యాజమాన్య సంస్థగా మారుతుంది అని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఫైలింగ్‌ తెలిపింది. భారతదేశంలో స్థాపించిన బహుళ భాషా వార్తా సంస్థలలో ఒకటైన ఐఎఎన్‌ఎస్‌ ప్రింట్‌, డిజిటల్‌, ప్రసార వేదికలలో వార్తా కంటెంట్‌లను అందిస్తుంది. ప్రధాన మీడియాగా చెలామణిలో ఉన్న ఎన్‌డిటివిని కూడా గతంలో అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేసుకుంది. ఆ తర్వాత తాజాగా ఐఎఎన్‌ఎస్‌ వార్తా సంస్థను కూడా అదానీ కంపెనీ స్వాధీనం చేసుకుంది.