భారత దేశం తన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు ముస్తాబవుతున్న వేళ.. ఉగ్రవాద ముఠాలు విధ్వంసానికి కుట్ర పన్నుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలతో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠాలు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా జనవరి 26వ తేదీన వేడుకలకు విఘాతం కలిగించేలా విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఉగ్రవాదులు తమ పాత పద్ధతులను మార్చుకుని.. స్థానిక నేరగాళ్లను వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, హర్యానా ప్రాంతాలకు చెందిన గ్యాంగ్స్టర్లను ‘ఫుట్ సోల్జర్స్’గా మార్చుకుని, వారి ద్వారా ఆయుధాల సరఫరా, దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ గ్యాంగ్స్టర్ నెట్వర్క్ ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలంగా విస్తరించి ఉంది. విదేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్థానీ సానుభూతిపరులు ఈ నేరగాళ్లకు భారీగా నిధులు సమకూరుస్తూ దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు కీలక ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ అర్ష్దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలా, రంజిత్ సింగ్ నీతా వంటి వారి పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి. మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, మాల్స్ వద్ద నిరంతరం నిఘా కొనసాగుతోంది. అనుమానిత వ్యక్తుల కదలికలపై డేగ కన్ను వేసిన భద్రతా బలగాలు, అణువణువూ తనిఖీలు చేస్తున్నాయి.
జనవరి 2026 మొదటి పక్షం రోజుల్లో ఉత్తర ఢిల్లీలోని సున్నితమైన ప్రదేశాలలో నాలుగు మాక్ డ్రిల్ వ్యాయామాలు నిర్వహించారు, వీటిలో కీలకమైన సంస్థాపనలు, చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ మార్కెట్లు, రవాణా కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడతారు. ఈ ప్రాంతాలలో ఎర్రకోట, ఐ ఎస్ బి టి, కాశ్మీర్ గేట్, చాందినీ చౌక్, ఖారీ బావోలి, సదర్ బజార్, మెట్రో స్టేషన్లు ఉన్నాయి. వీటిని భద్రతా దృక్కోణం నుండి అత్యంత సున్నితమైనవిగా పరిగణిస్తారు.
గణతంత్ర వేడుకలు జరిగే కర్తవ్య పథ్, ఎర్రకోట పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా మాక్ డ్రిల్స్ నిర్వహించి భద్రతా సన్నద్ధతను పరిశీలించారు. అనుమానాస్పద డ్రోన్లు, పారా గ్లైడర్లు ఎగరకుండా ‘నో ఫ్లై జోన్’ నిబంధనలను కఠినతరం చేశారు.
మరోవైపు ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ గ్యాంగ్-బస్ట్ 2026’ పేరుతో భారీ అణిచివేత చర్యలు ప్రారంభించి ఇప్పటికే 850 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే 112 నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

More Stories
ముంబై మేయర్ పదవికోసం శివసేన జగడం!
బీజాపూర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు మృతి!
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన సమయం వచ్చింది