వందేభారత్ స్లీపర్ కనీస ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్ కనీస ఛార్జీ రూ.960
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైన తర్వాత, భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘వందే భారత్ స్లీపర్’ రైళ్లు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరల్లో లగ్జరీ ప్రయాణం భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తూనే, ధరల విషయంలో కూడా స్పష్టతనిచ్చింది.  కోల్‌కతా నుండి గువాహటి మధ్య నడిచే ఈ స్లీపర్ రైలు కనీస ఛార్జీని రూ. 960గా నిర్ణయించారు. ఇది 400 కిలోమీటర్ల లోపు ప్రయాణించే 3ఏసీ  ప్రయాణికులకు వర్తిస్తుంది.
గరిష్టంగా 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసే వారికి 1ఏసీ కేటగిరీలో రూ. 13,300 వరకు ఛార్జీ ఉంటుంది.  విమాన ప్రయాణంతో పోలిస్తే తక్కువ ధరకే అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను, విశాలమైన బర్తులను ఈ రైలు అందించనుంది. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారనుంది.  కాగా, వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణీకుల సౌకర్యం, గోప్యతకు రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.  అందుకే ఈ రైళ్లలోఆర్ఎసి విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు.
సాధారణంగా ఇతర రైళ్లలో ఒకే సీటును ఇద్దరు పంచుకునే పరిస్థితి ఉంటుంది, కానీ వందే భారత్ స్లీపర్‌లో మాత్రం కేవలం ‘కన్ఫర్మ్ టికెట్’ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే వెసులుబాటు కలుగుతుంది.  ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, అత్యవసర బటన్ల వంటి ఆధునిక ఫీచర్లను అమర్చారు.
సాంకేతిక హంగులు, భద్రత ఈ స్లీపర్ రైళ్లను కేవలం వేగం కోసమే కాకుండా, ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వందే భారత్ ఛైర్ కార్ తరహాలోనే ఇందులో కూడా ‘కవచ్’ వంటి యాంటీ కొలిజన్ టెక్నాలజీని అమర్చారు.  రైలు లోపలి భాగం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితమై ఉంటుంది, ఇది ప్రయాణంలో శబ్దాలు, కుదుపులను తగ్గిస్తుంది.
కోల్‌కతా-గువాహటి మార్గంలో ప్రారంభమయ్యే ఈ సేవలు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను అనుసంధానించనున్నాయి. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ రైళ్లు, సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి