అమెరికా దురాక్రమణ దాడిలో 100 మంది మృతి

అమెరికా దురాక్రమణ దాడిలో 100 మంది మృతి
అమెరికా దురాక్రమణ దాడిలో సుమారు 100 మంది, అధికంగా యువకులు మరణించారని వెనిజులా అంతర్గత మంత్రి డియోస్టాడో కాబెల్లా తెలిపారు.  అయితే, వెనిజులా ఎప్పటికీ లొంగిపోదని, ఈ దేశం చరిత్రాత్మక, వారసత్వం కలిగిన దేశమని ఆయన స్పష్టం చేశారు. మదురో కిడ్నాప్‌ అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులైన డెల్సీ రోడ్రిగ్జ్‌కు తాము పూర్తి మద్దతునిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. 
 
దురాక్రమణ దాడి సమయంలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ ఇద్దరూ గాయపడ్డారని చెబుతూ మదురో, సిలియాలను వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం తాము యుద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన అమెరికా దురాక్రమణ దాడిని, మదురోను యుద్ధ ఖైదీగా ముద్రవేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
 
అమెరికా  దురాక్రమణ సైనిక లక్ష్యాలకే పరిమితం కాలేదని, పౌరులపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని నిరూపించే సాక్ష్యాధారాలు (వీడియో) తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు.  వెనిజులా, క్యూబన్లతో సహా మరణించిన వారికి ఆయన నివాళులర్పించారు. వెనిజులా ప్రజలు మదురో, సిలియాలకు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.  అమెరికా జోక్యం వెనుక వాస్తవం వెనిజులా సహజ వనరులను ముఖ్యంగా చమురును స్వాధీనం చేసుకోవడమని పునరుద్ఘాటించారు. 
 
సమస్య ప్రజాస్వామ్యం కాదని, సమస్య దేశ వనరులు అని చెప్పారు. మదురో కిడ్నాప్‌, సైనిక దురాక్రమణకు ప్రతిస్పందనగా ప్రపంచ దేశాలు పంపిన సంఘీభావ సందేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వెనిజులాలో శాంతికి హామీ బలీవియా విప్లవమేనని చెబుతూ నేడు వెనిజులాపై అమెరికా జరిపిన  దాడి, ఎక్కడైనా, ఎప్పుడైనా జరగవచ్చని హెచ్చరించారు.
ఇలా ఉండగా, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్, లాటిన్ అమెరికా దేశంపై దాడులు చేసినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మాదకద్రవ్యాలు, ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులకు సంబంధించిన ఆరోపణలన్నీ ‘అబద్ధాలే’ అని ఆమె కొట్టిపారవేసారు. ఈ ఆరోపణలన్నీ అమెరికాకు ఆ దేశ ‘చమురు’పై ఉన్న ఆసక్తి వల్లే చేస్తున్నారని, అయితే ‘అన్ని పక్షాలకు ప్రయోజనం చేకూరే’ ఇంధన సంబంధాలకు వెనిజులా సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
 
56 ఏళ్ల తాత్కాలిక అధ్యక్షురాలు గురువారం వెనిజులా పార్లమెంట్‌లో మాట్లాడుతూ “మేము ఒక శక్తివంతమైన ఇంధన దేశం, నిజంగానే,” అని రోడ్రిగ్జ్ చెబుతూ ఇదే తమకు  అపారమైన సమస్యలను తెచ్చిపెట్టిందని తెలిపారు.ఎందుకంటే ఉత్తర దేశాల ఇంధన దురాశ తమ దేశ వనరులను కోరుకుంటుందని అందరికి తెలిసిందే అని చెప్పారు.