వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోగా, ఇప్పటికే దేశ నూతన అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రీగెజ్ బాధ్యతలు చేపట్టారు. ఇకపై ఆ దేశ వ్యవహారాలన్నీ అమెరికా కనుసన్నల్లోనే సాగనున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు భారత్కు ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఆ దేశంలో ఎదుర్కొంటున్న ఆర్ధిక ఒడిదుడుకులను అహఁదిగమించి, తిరిగి తన కార్యకలాపాలను పెద్దఎత్తున చేపట్టే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఒకప్పుడు వెనెజువెలా నుంచి భారత్ భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుని ఇక్కడి రిఫైనరీల్లో శుద్ధి చేసేది.
2020లో వెనెజువెలాపై ఆంక్షల విధింపునకు మునుపు రోజుకు సగటున 4 లక్షల బ్యారెళ్ల ముడి చమురు భారత్కు దిగుమతయ్యేది.
ఆంక్షల దెబ్బతో ఈ దిగుమతులు చాలా వరకూ తగ్గిపోయాయి.ఇక భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కు తూర్పు వెనెజువెలాలోని శాన్క్రిస్టోబాల్ చమురు క్షేత్రంలో 40 శాతం వాటా ఉంది. వెనెజువెలా ప్రభుత్వ రంగ సంస్థ పీడీవీఎస్ఏ చేతుల్లో మిగతా 60 శాతం వాటా ఉంది. కానీ అమెరికా ఆంక్షల తర్వాత అక్కడి కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి.
2014 నాటికే వెనెజువెలా ప్రభుత్వం ఓఎన్జీసీకి దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర డివిడెండ్ చెల్లించాలి. ప్రస్తుతం ఈ బాకీ దాదాపు రెట్టింపైనట్టు సమాచారం.అయితే, వెనెజువెలా వ్యవహారాలు అమెరికా చేతుల్లోకి వెళ్లాక భారత్కు బాకీలు వసూలయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఓఎన్జీసీ మళ్లీ శాన్ క్రిస్టోబాల్ ఆయిల్ ఫీల్డ్స్లో తన కార్యకలాపాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది.
శాన్ క్రిస్టోబాల్ ఆయిల్ ఫీల్డ్స్లో ప్రస్తుతం ముడి చమురు వెలికితీత రోజుకు సుమారు 10 వేల బ్యారెళ్లుగా ఉంది. అమెరికా ఆంక్షలు తొలగిపోతే రాబోయే రోజుల్లో చమురు వెలికితీత లక్ష బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. తద్వారా బాకీలు వసూలు కావడంతో పాటు కనకవర్షం కురవడం ప్రారంభం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శాన్ క్రిస్టోబాల్ ఆయిల్ ఫీల్డ్తో పాటు కారబోబో ఆయిల్ ఫీల్డ్లోనూ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కు 11 శాతం వాటా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్కు చెరో 3.5 శాతం వాటాలున్నాయి. ఈ చమురు క్షేత్రంలో కూడా మెజారిటీ వాటా పీడీవీఎస్ఏదే. ఇక అమెరికా రంగంలోకి దిగాక పీడీవీఎస్ఏను పునర్వ్యవస్థీకరించడమో లేదా మరో అమెరికా చమురు సంస్థకు అప్పగించడమో జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
More Stories
కనీస పెన్షన్ ను రూ. 1,000 నుండి పెంచాలని కోరిన బిఎంఎస్
పాకిస్తాన్ నుంచి వైదొలిగిన టెలికాం దిగ్గజం టెలినార్
సుంకాలు పెంచుతానని ట్రంప్ మరోసారి హెచ్చరిక!