టిటిడి అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు

టిటిడి అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు

టీటీడీ అనుబంధ ఆలయాల్లో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, అందుకు అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి విచ్చేసే దివ్యాంగ భక్తులు సౌకర్యంగా రాకపోకలు సాగించేందుకు చెక్క బల్లలతో బల్లపరుపు (వుడెన్ ర్యాంప్) ను ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా సెల్ ఫోన్,   లగేజీ కౌంటర్లు, తాగునీరు తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. 

ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. చంటి పిల్లలకు తల్లులు సౌకర్యవంతంగా పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులు వచ్చే రాకపోకలకు అనుగుణంగా క్యూలైన్లు, భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద లోహాలను గుర్తించే భద్రతా పరికరాలను  ఏర్పాటు చేయాలని వివరించారు.

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తి భావం మరింత ఉట్టిపడేలా పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సింఘాల్ సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే అరికట్టాలని, నార్త్ మాడ, సౌత్ మాడ వీధుల్లో డ్రైనేజీ సక్రమంగా ఉండేలా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ మహా రథంకు సంబంధించి బీహెచ్ ఈఎల్ అధికారులతో సంప్రదించి మరమ్మత్తులు చేపట్టాలని చెప్పారు. స్వామి వారు విహరించే వాహనాలు, తండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు టిటిడి అనుబంధ ఆలయాలను అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేపట్టేలా సంబంధిత ఆలయాల అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆయన తెలిపారు. అనుబంధ ఆలయాలలో భక్తుల రద్దీకి తగ్గట్లు అవసరమైన పార్కింగ్ , మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని  సూచించారు.