పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్లో గల ఒక ప్రైవేట్ పాఠశాల వేదికపై సంగీత ప్రదర్శన ఇస్తున్న సింగర్ లగ్నజిత చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. పాఠశాల యజమాని, కచేరీ ఆర్గనైజర్ అయిన మహబూబ్ మాలిక్ అనే వ్యక్తి, ఆమె పాట పాడుతుండగా స్టేజ్ పైకి వచ్చి అరుస్తూ దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
‘వసంతం వచ్చేసింది’ అనే బెంగాలీ పాటతో పాపులర్ అయిన చక్రవర్తి ఆ పాటను పాడుతుండగా మాలిక్ స్టేజ్పైకి వచ్చి పెద్దగా అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. భక్తి పాట కాకుండా సెక్యులర్ పాట పాడాలని తనపై ఒత్తిడి చేసినట్టు ఆమె వాపోయారు. కళాకారుల స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.
తొలుత ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ, తీవ్ర ఒత్తిడి తర్వాత పోలీసులు నిందితుడు మహబూబ్ మాలిక్ను అరెస్టు చేశారు. అయితే నిందితుడి సోదరుడు మసూద్ మాలిక్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ సింగర్ అదనపు సమయం కోసం అదనపు డబ్బు డిమాండ్ చేసిందని, అది నిరాకరించినందుకే తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. పాఠశాల ఫంక్షన్ కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన సెక్యులర్ పాట పాడమని మాత్రమే కోరామని ఆయన సమర్థించుకున్నారు.
కానీ, లగ్నజిత ఈ వాదనలను పూర్తిగా ఖండించారు. కేవలం పాట విషయంలోనే కాకుండా, ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారింది. బాధితురాలికి అండగా ఉండాల్సిన అధికారి కేసు నమోదుకు నిరాకరించడంతో, ప్రస్తుతం సదరు అధికారిపై కూడా శాఖాపరమైన విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో రాజకీయ సెగలు రేపుతోంది. రాష్ట్రంలో ‘జిహాదీ’ సంస్కృతి పెరిగిపోయిందని, కళాకారులు ఏ పాట పాడాలో కూడా మతోన్మాదులే నిర్ణయించే స్థాయికి పరిస్థితి దిగజారిందని బీజేపీ నేత షాకుదేబ్ పాండ తీవ్ర విమర్శలు చేశారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని, ఒక సింగర్ ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు స్పందించకపోవడం రాష్ట్రంలోని శాంతిభద్రతల స్థితికి అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు.
పూర్బా మేదినీపూర్ ఎస్పీ మితున్ డే మాట్లాడుతూ, నిందితుడిని అరెస్టు చేశామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. “ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము,” అని పేర్కొంటూ ఈ ఘటనపై భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి అధికారిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు. గాయనిని, ఆమె బృందాన్ని మొదట అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిరుత్సాహపరిచారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. “ఏదైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే, తగిన చర్యలు తీసుకుంటాము,” అని స్పష్టం చేశారు.
సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి కూడా ఈ చర్యను ఖండిస్తూ ఇటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి అరూప్ చక్రవర్తి ఈ ఘటనను “ఖండనీయం” అని అభివర్ణించారు. ప్రతి సంఘటనకు టీఎంసీని ముడిపెట్టడం సరికాదని చెప్పారు.
More Stories
‘బాబ్రీ మసీదు’ నమూనా నిర్మాణం వెనుక రాజకీయ కుట్ర
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో `మహాయుతి’ భారీ విజయం
మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిన మధ్య ప్రదేశ్