పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఎల్ఈటి కమాండర్ సాజిద్ జాట్

పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఎల్ఈటి కమాండర్ సాజిద్ జాట్
* పహల్గాం ఉగ్రదాడి చార్జిషీట్ లో వెల్లడి  
పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాడి జరిగిన ఎనిమిది నెలల తర్వాత సోమవారంనాడు జమ్మూలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దాడి ప్రధాన సూత్రధారిగా పాకిస్థాన్‌‌ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా (ఎల్ఈటి) కమాండర్ జాజిద్ జాట్ ను పేర్కొంది.  యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ నరమేధానికి లష్కరే నేత ప్రణాళిక రచించాడని, ది రెసిస్టంట్ ఫ్రంట్ (ఆర్ టి ఎఫ్) ఉగ్రవాదులు అమలు చేశారని ఎన్‌ఐఏ  వెల్లడించింది. 
పహాల్గమ్ దాడితో సంబంధమున్న ఏడుగురిపై ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వీరిలో ఐదుగురు అనుమానితులు, ఉగ్రసంస్థలైన లష్కరే తోయిబా అగ్రనేత సాజిత్ జాట్, టీఆర్‌ఎఫ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సాజిత్ ఆయుధాలు సమకూర్చాడని ఎన్‌ఐఏ తమ 1,597 పేజీల సుదీర్ఘ చార్జిషీట్‌లో తెలిపింది.  హహల్గాం దాడిలో పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్ర, వాటిని బలపరచే సాక్ష్యాలను ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. 
ఈ లోతైన కుట్ర పాకిస్తాన్ వరకు విస్తరించి ఉందని, ఆ దేశం “నిరంతరాయంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని” దర్యాప్తు సంస్థ పేర్కొంది. నిషేధిత ఎల్ఈటీ/టీఆర్‌ఎఫ్ సంస్థ ఈ కుట్రకు ప్రణాళిక రచించి దాన్ని అమలు చేసినట్టు తెలిపింది. మతం పేరు అడిగిమరీ పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఒక పౌరుడు సహా 25 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్నారని పేర్కొంది.

ఉగ్రదాడి అనంతరం జూలైలో చేపట్టిన ఆపరేషన్ మహదేవ్‌లో భారత బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాక్ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. ఈ ఉగ్రవాదులను ఫైసల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానిగా పేర్కొంది.  ఈ ముగ్గురితో పాటు సాజిద్ జాట్, ఎల్‌ఈటీ/టీఆర్‌ఎఫ్‌పై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) 2023, ఆయుధాల చట్టం-1959, చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం-1967లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను మోపింది. 

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే కారణంగా జూన్ 22న అరెస్టు చేసిన మరో ఇద్దరు నిందితులు పర్వెజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది.  ఇంటరాగేషన్‌లో ఈ ఇద్దరూ దాడిలో ప్రమేయమున్న మరో ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఈ ముగ్గురూ ఎల్‌ఈటీ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసిన పాక్ ఉగ్రవాదులని అంగీకరించారు. పాక్‌కు చెందిన మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు సాజిద్ జాట్. ఇతనిపై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. 

అతని అసలు పేరు హబీబుల్లా మాలిక్. పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లావాసి. సైఫుల్లా, నోమి, నూమన్, లంగ్డా, అలీ సాజిద్, ఉస్మాన్ హబీబ్, షాని అనే పేర్లు కూడా ఇతనికి ఉన్నాయి. టీఆర్ఎఫ్ టాప్ కమాండర్‌గా జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ప్రధాన ఉగ్రదాడుల్లో ఇతని ప్రమేయం ఉంది.  2022 అక్టోబర్‌లో యూఏపీఏ కింద అధికారికంగా వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించారు. 

ఇస్లామాబాద్‌లో ఎల్ఈటీ ప్రధాన కార్యాలయం నుంచి ఇతను భారత్‌లో ఉగ్రవాదాన్ని నడిపించే నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారంటూ సాజిత్ జాట్‌పై పలు ఛార్జిషీటు సైతం ఎన్ఐఏ నమోదు చేసింది. కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత టెర్రర్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న అత్యత ప్రమాదకరమైన వ్యక్తుల్లో ఒకరిగా సాజిద్‌ను భద్రతా సంస్థలు చెబుతున్నాయి.

భారత్‌పై వీరు యుద్ధం ప్రకటించారన, వీరిని కఠినంగా శిక్షించాలని ఎన్‌ఐఏ వర్గాలు చెప్పాయి. జూన్‌లో భారత సైన్యం చేతిలో హతమైన పాక్‌ ఉగ్రవాదులు సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హంజా అఫ్గనీల పేర్లను కూడా చార్జిషీట్‌లో పేర్కొంది ఎన్‌ఐఏ.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, “ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కోర్టు తీసుకుంటుంది. ఇలాంటి విషయాలను న్యాయవ్యవస్థకే వదిలివేయాలని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అని నిర్ణయించడం నా పని కాదు, లేదా మరెవరి పని కూడా కాదు. ఒక చట్టం ఉంది, ఒక కోర్టు ఉంది, కోర్టే నిర్ణయం తీసుకుంటుంది. దర్యాప్తు జరపడం ఎన్‌ఐఏ పని, ఆ దర్యాప్తు పూర్తయింది” అని పేర్కొన్నారు.