ఇండిగో ప్రయాణికులకు రూ.10వేలు విలువైన ట్రావెల్ వోచర్స్

ఇండిగో ప్రయాణికులకు రూ.10వేలు విలువైన ట్రావెల్ వోచర్స్
సంక్షోభం వేళ దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. గతవారం అంతరాయం కారణంగా వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10 వేలు విలువైన అదనపు ట్రావెల్‌ వోచర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వోచర్లు డిసెంబర్‌ 3, 4, 5 తేదీల మధ్య ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని ఇండిగో స్పష్టం చేసింది. 

ఈ ట్రావెల్‌ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ గందరగోళం కారణంగా తమ కస్టమర్లు చాలా మంది విమానాశ్రయాల్లో చాలా గంటల పాటూ చిక్కుకుపోయారని అంగీకరించింది. ఈ సందర్భంగా సంక్షోభంపై ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం, విమానాల రద్దు కారణంగా ప్రయాణికులకు పరిహారం అందిస్తామని, ఈ వోచర్లు ప్రయాణికులకు అదనంగా ఇస్తున్నామని ఇండిగో పేర్కొంది.

ఇండిగో సంక్షోభం సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినందుకు విచారం వ్యక్తం చేసింది. “ప్రభుత్వ మార్గదర్శకాలకు అదనంగా, విమానం బయలుదేరే సమయానికి 24 గంటల్లోపు విమానాలు రద్దు అయితే, విమానం బ్లాక్ సమయాన్ని బట్టి, ప్రతి ప్రయాణికుడికి రూ.5వేలు నుంచి రూ.10వేలు వరకు పరిహారం​ అందిస్తాం” అని ఇండిగో ప్రకటించింది.