దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. వరుసగా ఐదోరోజు కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి. శనివారం ఉదయం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కతా సహా అన్ని ఎయిర్పోర్టుల్లో 470కిపైగా విమానాలు క్యాన్సెల్ అయ్యాయి. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.
ఇక ఇండిగో సంక్షోభం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని దీనిపై తక్షణమే విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంజ్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది.
ఇండిగో భారీ ఎత్తున విమానాలు రద్దు చేయడంతో ఎయిర్ చార్జీలు ఒక్కసారిగా పెరగడంపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న పౌర విమానయాన మంత్రిత్వశాఖ, శనివారం అత్యవసర చర్యలు చేపట్టింది. అసాధారణంగా పెరిగిన టికెట్ ధరలను అదుపులో పెట్టేందుకు అన్ని విమానయాన సంస్థలపై తాత్కాలిక ఫేర్ క్యాప్లు విధిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ కొన్ని ఎయిర్లైన్స్ అధిక ధరలు వసూలు చేస్తున్నాయని వచ్చిన అనేక ఫిర్యాదులపై మంత్రిత్వశాఖ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని డిల్లీ ఎయిర్పోర్టు ప్రకటన విడుదల చేసింది. అయితే కొన్ని సరీసులపై ప్రభావం కొనసాగుతోందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్వర్క్ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
అన్ని విమానయాన సంస్థలు నిబంధనలు సరిగా పాటిస్తున్నాయో, లేదో నిర్ధరిస్తామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ, ఎలా తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేశామని తెలిపారు.

More Stories
ఇండిగో సంక్షోభంపై అత్యున్నత విచారణ .. వేయి విమానాలు రద్దు
మస్క్ సోషల్ మీడియా ‘ఎక్స్’పై ఈయూ భారీ జరిమానా
మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ