పిఠాపురం నుంచే జనసేన ప్రక్షాళన కసరత్తు!

పిఠాపురం నుంచే జనసేన ప్రక్షాళన కసరత్తు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీలో ప్రక్షాళన ప్రక్రియను తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురం నుంచే ప్రారంభించారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరుపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకున్న పవన్ కళ్యాణ్, కొందరిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వారికి తన మార్క్ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 
 
పార్టీ కమిటీల నిర్మాణం, కూర్పుపై ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ నిర్ణయించారు.   పిఠాపురం సహా ఎమ్మెల్యేలు గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై సమాచారం సేకరించి, వ్యవస్థను సరిదిద్దేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
పార్టీ ప్రక్షాళనలో భాగంగా,  గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్‌ను రెండు నెలల క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆ తర్వాత, పార్టీ పనులను పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన  కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు సహా తొలగించబడిన మర్రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు.

అయితే, ఇటీవల కాలంలో మర్రెడ్డిపై పార్టీ కార్యకర్తల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో పాటు, ఆయన పనితీరు పార్టీ కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ మర్రెడ్డి స్థానంలో ఓదూరి కిశోర్‌ను కొత్త సభ్యుడిగా నియమించారు. 

 
ప్రస్తుతం పార్టీ హైకమాండ్ ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన నేతలు ఉన్నారని భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.  ఈ ప్రక్షాళన, కమిటీల పునర్నిర్మాణం ద్వారా జనసేన పార్టీని మరింత క్రియాశీలం చేసి, క్షేత్ర స్థాయిలో పార్టీ పట్టును బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.