* ఐపీఎస్ విజయ్ సఖారే నేతృత్వంలో స్పెషల్ టీమ్
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దాడి ఘటనపై దర్యాప్తులో రాజధాని ప్రాంతంలో వరుస దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తాజాగా తేలింది. ముంబై 26/11 ఉగ్రదాడి తరహాలోనే రాజధానిలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి రద్దీ ప్రదేశాలను టార్గెట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఉగ్ర దాడి కోసం భారీగా బాంబులను కూడా తయారుచేస్తున్నట్లు పేర్కొన్నాయి.
2008, నవంబర్ 26న ముంబైలో తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లియోపోల్డ్ హాస్పిటల్ సహా దాదాపు 12 ప్రదేశాల్లో ఉగ్రవాదులు భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే తరహాలో దేశరాజధాని ఢిల్లీలోనూ దాడులకు కుట్ర చేసినట్లు అధికారులను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఢిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కూడా తేలింది. పాకిస్థాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూల్ నెలల తరబడి ఈ దాడికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దాడి కోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీతోపాటూ గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా దేశంలోని పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ను లక్ష్యంగా చేసుకున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దేశంలోని మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సంబంధిత వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం జమ్ము కశ్మీర్లోని పుల్వామా, షోపియాన్, అనంత్నాగ్ ప్రాంతాలకు చెందిన కొంతమంది వైద్యులను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇలా ఉండగా, ఢిల్లీ పేలుడు కేసును దర్యాప్తు చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ విజయ్ సఖారే నేతృత్వంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్లో ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇద్దరు డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ లు, ముగ్గురు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లు, మిగతా ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.
ఈ కేసు విచారణ కోసం ఎన్ఐఏ జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి, ఢిల్లీ పోలీసుల నుంచి, హర్యానా పోలీసుల నుంచి జైష్ ఏ మహ్మద్కు సంబంధించిన అన్ని కేసుల డైరీలను సేకరించనుందని అధికారులు తెలిపారు. తద్వారా జైష్ ఏ ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు, ఆర్థికపరంగా ఎవరు సహకరిస్తున్నారనే విషయాన్ని గుర్తించే పనిలో ఉంది. ఉగ్రవాదుల కదలికలను తెలుసుకునేందుకు ఎన్ఐఏ ఇప్పటికే 1000కి పైగా సీసీ ఫుటేజ్లను స్కాన్ చేసింది.

More Stories
ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ!
ఆర్థిక పాలన నమూనాను సరిగ్గా అర్థం చేసుకోండి!
ఢిల్లీ పేలుడులో సూత్రధారులు ఐదుగురు వైద్యులు!